సిడ్నీ: బోర్డర్ –గావస్కర్ ట్రోఫీలోని చివరి, నాలుగో టెస్ట్ షెడ్యూల్ ప్రకారం జరిగే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి. ఈ నెల15–19 తేదీల్లో బ్రిస్బేన్లోని గబ్బా స్టేడియం వేదికగా ఈ మ్యాచ్ జరగాల్సి ఉంది. కానీ కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు క్వీన్స్ల్యాండ్ స్టేట్లో కఠినమైన రూల్స్ అమలు చేస్తుండటంతో ఈ మ్యాచ్ జరగడంపై సందేహాలు మొదలయ్యాయి. బ్రిస్బేన్లో ఉన్న రూల్స్ నుంచి తమ టీమ్కు మినహాయింపు ఇవ్వాలని బీసీసీఐ గురువారమే క్రికెట్ ఆస్ట్రేలియా(సీఏ)ను కోరింది. ఇది, జరిగి 24 గంటలు గడవక ముందే బ్రిస్బేన్లో మూడు రోజుల లాక్డౌన్ విధించారు. బ్రిస్బేన్లోని ఓ హోటల్ వర్కర్ కరోనా పాజిటివ్గా తేలాడు. యూకే నుంచి స్ప్రెడ్ అవుతున్న కొత్త వైరస్ స్ట్రెయిన్స్ ఆ వ్యక్తి శాంపిల్స్లో దొరికాయి.
దీంతో వెంటనే లాక్డౌన్ ప్రకటించగా.. గబ్బా టెస్ట్ అంశం మరింత హీట్ సంతరించుకుంది. మరోపక్క స్ట్రిక్ట్ రూల్స్ విషయంలో బీసీసీఐ ఇప్పటికే అసంతృప్తి తెలియజేయడంతో సీఏ అప్రమత్తమైంది. వచ్చే వారం నాటికి బ్రిస్బేన్లో పరిస్థితులను అంచనా వేసే పనిలో పడింది. నిజానికి గబ్బా టెస్ట్కు 36,000 మందిని స్టేడియంలోకి అనుమతించాలని భావించారు. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో ఆ నిర్ణయాన్ని కూడా వెనక్కు తీసుకునే చాన్స్ ఉంది. కాగా, బ్రిస్బేన్లో అమల్లో ఉన్న రూల్స్ ప్రకారం.. మ్యాచ్ అనంతరం ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ హోటల్ రూమ్ను వదిలి బయటకు రాకూడదు.
దీనిని వ్యతిరేకించిన బీసీసీఐ తమ టీమ్కు ఎగ్జెంప్షన్ ఇవ్వాలని సీఏ కు గురువారం లెటర్ పంపింది. దాంతో ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్ హోటల్లో ఒకరినొకరు కలవొచ్చని, కలిసి తిరగవచ్చని ఇండియన్ బోర్డుకు సీఏ హామీ ఇచ్చింది. ఈ మేరకు క్వీన్స్ల్యాండ్ గవర్నమెంట్ కూడా అనుమతి ఇచ్చిందని పేర్కొంది. అయితే లిఖితపూర్వకంగా తమకు తెలియజేస్తేనే బ్రిస్బేన్ వెళ్లేందుకు రెడీ అవుతామని బీసీసీఐ చెబుతోంది. దీంతో నాలుగో టెస్ట్ అంశం రోజుకోరకంగా మారుతోంది. ఒక వేళ బ్రిస్బేన్లో ఆతిథ్యమివ్వలేకపోతే చివరి టెస్ట్ను సిడ్నీలోనే నిర్వహించే అవకాశం ఉంది.
టీమిండియా బాధ్యత బీసీసీఐదే: గావస్కర్
క్వీన్స్ల్యాండ్ ప్రజల హెల్త్ స్టేఫీకి అక్కడి గవర్నమెంట్ ఎలా కట్టుబడి ఉందో.. టీమిండియా విషయంలో బీసీసీఐ కూడా అలానే ఉండాలని మాజీ క్రికెటర్ సునీల్ గావస్కర్ అన్నాడు. ‘ ప్రజల రక్షణకు క్వీన్స్ల్యాండ్ గవర్నమెంట్ పూర్తిగా కట్టుబడి ఉంది. జట్టు రక్షణ విషయంలో బీసీసీఐ కూడా అలానే ఉంటుందని భావిస్తున్నా. సిడ్నీ టెస్ట్ చూసేందుకు ఫ్యాన్స్ స్టేడియానికి వస్తున్నారు. ఆట కంప్లీట్ అయ్యాక డిన్నర్ కోసం దగ్గర్లోని రెస్టారెంట్కు కూడా వెళ్తున్నారు. కొన్ని పబ్ల్లో 20–30 మంది గ్రూపులు కూడా కడుతున్నారు. కాబట్టి టీమిండియా చేస్తున్న డిమాండ్లో తప్పేం లేదు. 10 గంటల పాటు గ్రౌండ్లో గడిపిన తర్వాత ప్లేయర్లను ఒకరినొకరు కలవొద్దు అంటే ఎలా ?. కనీసం హోటల్లో అయినా వారికి కలిసి తిరిగే చాన్స్ ఇవ్వాలి’ అని గావస్కర్ అభిప్రాయపడ్డాడు.

