నీళ్ల మీద పడిన గాలి మన మొహాలను తాకితే ఆ అనుభూతి మస్తుంటది. అలాంటి ప్రాంతాలకు టూర్ వెళితే మనసు హాయిగా ఉంటది. అక్కడే హోటళ్లలో దిగితే మరింత ఆనందం సొంతమవుతుంది. అలాంటి హోటలే రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఉన్న తాజ్ లేక్ ప్యాలెస్. అందుకే ప్రపంచంలోని బెస్ట్ హోటళ్ల జాబితాలో మూడో స్థానాన్ని సాధించింది. దాంతో పాటు టాప్ టెన్లో రాంబాగ్ ప్యాలెస్ హోటల్ కూడా చోటు సంపాదించింది. వీటికి రేటింగ్లిచ్చింది కూడా పర్యాటకులే. కోండే నాస్ట్ ట్రావెలర్ అనే సంస్థ ఇటీవల రీడర్స్ చాయిస్ అవార్డ్స్ను ప్రకటించింది. అందులో భాగంగా ప్రపంచంలోని 17 ఉత్తమ హోటళ్ల జాబితాను ప్రకటించింది. రాంబాగ్ ప్యాలెస్ 7వ ర్యాంకు సాధించగా, అలిలీ ఫోర్ట్ బిషన్గఢ్ 11వ స్థానంలో నిలిచింది. ఈ సారి గ్లోబల్ రీడర్స్ చాయిస్ జాబితాలో అమెరికా, బ్రిటన్లనూ చేర్చింది కోండె నాస్ట్ ట్రావెలర్. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మంది ఓటింగ్లో పాల్గొన్నారు. వాళ్లకు ఇష్టమైన ప్రాంతాలు, హోటళ్లు, స్పాలు, ఎయిర్లైన్స్, క్రూయిజ్ లైన్స్ వంటి వాటికి రేటింగ్ ఇచ్చారు. ఆ జాబితాలో భాగంగానే దేశంలోని తాజ్ ప్యాలెస్ హోటళ్లను అక్కున చేర్చుకున్నారు. ప్యాలెస్లు అనగానే మనకు గుర్తొచ్చేది రాజులు, రాణులే కదా. వాళ్ల హుందాతనానికి తగ్గట్టు వాటిని కట్టుకున్నారు. ఇప్పుడు హోటళ్లుగా మారిన ఆ కోటలు పర్యాటకులకు మంచి అనుభూతిని మిగుల్చుతున్నాయి. అందుకే ఇతర తాజ్ ప్యాలెస్ హోటళ్లూ వివిధ కేటగిరీల్లో చోటు సంపాదించాయి. ఇండియా టాప్ 15 హోటళ్ల జాబితాలో ఉమైద్ భవన్ ప్యాలెస్ (జోధ్పూర్), జై మహల్ ప్యాలెస్ (జైపూర్), తాజ్ మహల్ ప్యాలెస్ (ముంబై) వంటివి ఆ జాబితాలో ఉన్నాయి. జాబితాలో మంచి స్థానాలను దక్కించుకోవడంపై తాజ్ గ్రూప్ ఆపరేషన్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రోహిత్ ఖోస్లా ఆనందం వ్యక్తం చేశారు. దేశ చారిత్రక సంస్కృతిని కాపాడడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని, ఈ అవార్డులే తాము అతిథులకు మంచి ఆతిథ్యం ఇస్తున్నామనడానికి నిదర్శనమన్నారు.