రాష్ట్రానికి, దేశానికి మంత్రి కేటీఆర్‌‌ సేవలు అవసరం: తలసాని

రాష్ట్రానికి, దేశానికి మంత్రి కేటీఆర్‌‌ సేవలు అవసరం: తలసాని

హైదరాబాద్‌: రాష్ట్రానికి, దేశానికి మంత్రి కేటీఆర్‌‌ సేవలు చాలా అవసరం అని రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ అన్నారు. కేటీఆర్‌‌ చాలా చిన్నవయసులోనే అత్యంత నైపుణ్యాన్ని సంపాదించారని కొనియాడారు. తక్కువ కాలంలోనే ఐటీ ఇండస్ట్రీ హైదరాబాద్‌కు రావడానికి కేటీఆర్‌‌ కారణమని తలసాని అన్నారు. శక్రవారం మంత్రి కేటీఆర్‌‌ పుట్టినరోజు సందర్భంగా గన్‌షౌండ్రి కార్పొరేటర్‌‌ మమతా సంతోష్‌ గుప్తా ఆధ్వర్యంలో కోఠీలోని గవర్నమెంట్‌ ప్రసూతి హాస్పిటల్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈ విషయాలు వెల్లడించారు. ఈ సందర్భంగా హాస్పిటల్‌లోని గర్భణీలకు మాస్కులు, శానటైజర్లు, పండ్లు, చీరలు పంపిణీ చేశారు. కరోనా కారణంగా కేటీఆర్ జన్మదిన వేడుకలను భౌతిక దూరం పాటిస్తూ నిరాడంబరంగా నిర్వహించుకుంటున్నామని మంత్రి తెలిపారు. ఐటీ శాఖ మంత్రి గా కేటీఆర్‌‌ రాష్ట్రాన్ని దేశంలోనే అగ్రగామిగా తీర్చిదిద్దుతున్నారని అన్నారు. కరోనా వల్ల ప్రపంచమంతా అతలాకుతలం అవుతుందని, ఇలాంటి విపత్కర సమయంలో డాక్టర్లు , ఆసుపత్రి సిబ్బంది అందిస్తున్న సేవలు విశేషమైనవని మంత్రి కొనియాడారు. ప్రతిపక్షాలు విమర్శలు పక్కనపెట్టి కోవిడ్ ఆసుపత్రులను సందర్శించి డాక్టర్లకు మనో ధైర్యం చెప్పాలని తలసాని సూచించారు.