Madhumitha: కొంప ముంచిన కొత్తకారు.. కానిస్టేబుల్‌ బైక్‌ ఢీ..సీరియల్ నటిపై కేసు

Madhumitha: కొంప ముంచిన కొత్తకారు.. కానిస్టేబుల్‌ బైక్‌ ఢీ..సీరియల్ నటిపై కేసు

ప్రముఖ తమిళ బుల్లితెర నటి మధుమిత(Madhumitha)పై చెన్నై పోలీసులు కేసు నమోదు చేశారు. ట్రాఫిక్ మూసివేసిన రహదారిపై తన కొత్త కారును డ్రైవ్ చేసి..ఆపై మోటార్ సైకిల్ నడుపుతున్న పోలీసు అధికారిపైకి దూసుకెళ్లినందుకు కేసు నమోదు చేశారు. ఈ ఘటనలో గాయపడ్డ వ్యక్తిని..సెమ్మంచెరి పోలీస్ స్టేషన్‌లో రైటర్‌గా పనిచేస్తున్న రవికుమార్‌గా గుర్తించారు. ఆయన బైక్‌పై నుంచి కిందపడటంతో స్వల్ప గాయాలయ్యాయి. దీంతో చెన్నైలోని ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు కేసు నమోదు చేశారు.

వివరాల్లోకి వెళితే..

తమిళ సీరియల్ ‘ఎతిర్నీచల్’ ఫేమ్ మధుమిత కొత్తగా కొన్న కారును నడుపుతూ..ఒక దేవాలయాన్ని సందర్శించి షోలింగనల్లూర్ నుండి తిరిగి వస్తుండగా..అక్కరై మీదుగా ECRకి వెళ్లడానికి ప్రయత్నిస్తూ..వన్-వే స్ట్రెచ్‌లో రాంగ్ సైడ్‌లో డ్రైవ్ చేసి..ఎదురుగా బైక్ నడుపుతున్న పోలీసు కానిస్టేబుల్‌ను ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు వాహనాలు తీవ్రంగా శిథిలమయ్యాయి. అలాగే, కానిస్టేబుల్‌ రవికుమార్‌ తీవ్రంగా గాయపడ్డాడు.వెంటనే అతన్ని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం తరలించారు. ఆపై ట్రాఫిక్ ఇన్వెస్టిగేషన్ పోలీసులు మధుమితపై కేసు నమోదు చేశారు.