- హైకోర్టు ఆదేశాలతో 30 నుంచి 20 పాయింట్లకు తగ్గిన సర్వీస్ వెయిటేజీ
- 18 నుంచి 22 వరకు అభ్యంతరాల స్వీకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో 1,931 మల్టీ పర్పస్ హెల్త్ అసిస్టెంట్(ఏఎన్ఎం) పోస్టుల రిక్రూట్మెంట్కు సంబంధించి ప్రొవిజనల్ మెరిట్ లిస్ట్ ను మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు గురువారం విడుదల చేసింది. ఈ పోస్టులకు మొత్తం 24,268 మంది దరఖాస్తు చేసుకోగా గతేడాది డిసెంబర్ 29న జరిగిన కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 20,600 మంది హాజరయ్యారు.
తాజాగా విడుదల చేసిన జాబితాలో అభ్యర్థుల సీబీటీ మార్కులు, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్ సర్వీస్ వెయిటేజీ మార్కులను బోర్డు వెల్లడించింది. అభ్యంతరాలను మే18 నుంచి మే 22వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు ఆన్లైన్లో తెలపవచ్చని బోర్డు సూచించింది. అభ్యంతరాలను ఒక్కసారి మాత్రమే నమోదు చేసే చాన్స్ ఉందని అభ్యర్థులు జాగ్రత్తగా ఉండాలని బోర్డు సెక్రటరీ హెచ్చరించారు.
హైకోర్టు ఆదేశాలతో మారిన వెయిటేజీ..
ఈ నియామకాల్లో సర్వీస్ వెయిటేజీ పాయింట్లపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేయడంతో బోర్డు నిబంధనల్లో మార్పులు చేసింది. గతంలో 30 మార్కులుగా ఉన్న కాంట్రాక్ట్ వెయిటేజీని 20 మార్కులకు పరిమితం చేశారు. దీనివల్ల అభ్యర్థులకు నష్టం కలగకుండా ఉండేందుకు పరీక్ష మార్కులను దామాషా పద్ధతిలో సర్దుబాటు చేశారు. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ విభాగంలో 1,666 పోస్టులు ఉండగా, తెలంగాణ వైద్య విధాన పరిషత్ (టీవీవీపీ) పరిధిలో 265 పోస్టులు ఉన్నాయి. ఈ నియామకాలు ప్రస్తుతం కోర్టుల్లో పెండింగ్లో ఉన్న వివిధ కేసుల తుది తీర్పులకు లోబడి ఉంటాయని అధికారులు వెల్లడించారు.
