ప్రజలకు నష్టం కలిగిస్తున్న పొగాకును అరికట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక చట్టాన్ని తీసుకొచ్చిందని తెలిపారు మంత్రి ఈటల రాజేందర్. దీనికి ప్రభుత్వ ప్రమేయమే కాకుండా ప్రజలంతా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్లే కాపాడుకోవాలని సూచించారు. ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు మంత్రి ఈటల.
పొగాకు నియంత్రణలో దేశంలోనే తెలంగాణ ముందంజలో ఉందన్నారు ఈటల. పొగాకు దురలవాట్లకు యువత దూరంగా ఉండాలన్నారు. పొగాకు వాడకం ద్వారా కలిగే చెడు పరిణామాలు,వాటిని అరికట్టడానికి ప్రజలలో అవగాహనను పెంచటానికి ఎంతో మంది డాక్టర్లు, నర్సులు, ఇతర వైద్య సిబ్బంది, స్వచ్ఛంద సంస్థలు నిరంతరం ఎంతో కృషి చేస్తున్నాయన్నారు. రాబోయే రోజుల్లో తెలంగాణను పొగాకు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాలా కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ప్రజలకు వైద్య సేవలను మరింత చేరువ చేసేందుకే బస్తీ దవాఖానాలు ప్రారంభించినట్లు చెప్పిన ఈటల.. గతంలో ఉన్న 122 దవాఖానాలకు అదనంగా 44 కొత్తవి ప్రారంభించినట్లు తెలిపారు.