తెలంగాణ కాంగ్రెస్ లో మంచి లీడర్లు ఉన్నారని, పార్టీ అధికారంలోకి రావాలంటే సమిష్టి కృషి అవసరమని చెప్పారు రాష్ట్ర కాంగ్రెస్ ఇంచార్జ్ మణికం ఠాకూర్. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తేవడమే తమ మిషన్ అని ఆయన పేర్కొన్నారు. మోడీ, కేసీఆర్ విధానాలపై పోరాడతామని చెప్పారు. సోమవారం మీడియాతో నిర్వహించిన చిట్చాట్లో ఆయన మాట్లాడుతూ.. పార్టీ అధికారంలోకి రావాలంటే పెద్ద కష్టమేమీ కాదని, ప్రతి ఒక్కరూ పార్టీ స్టాండ్ ఫాలో కావాలని అభిప్రాయపడ్డారు. 2023లో పార్టీ అధికారంలోకి రావాలంటే కొన్ని స్టాండ్స్ తీసుకొని ఫాలో అయితే చాలని చెప్పారు. పార్టీ పటిష్టంగా ఉండాలంటే నేతల మధ్య ఐకమత్యం ఉండాలని అన్నారు.
వ్యవసాయ బిల్లుపై నిరసన గురించి మాట్లాడుతూ.. తాము గవర్నర్ ను ముందే అపాయింట్మెంట్ కోరామని, అక్కడి నుంచి స్పందన రాలేదన్నారు. కాంగ్రెస్ లో గ్రూపులనేవి క్రికెట్ టీమ్ లాంటిదని, అందరూ టీమ్ కోసం మాత్రమే ఎలా అడుతారో.. కాంగ్రెస్ లో కూడా నేతలందరూ పార్టీ కోసమే పనిచేస్తారని చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఎప్పటికి యువ నాయకత్వం వస్తూనే ఉంటుందన్నారు.
2014-2018 ఎన్నికల్లో జరిగిన విషయాలను నేమర్వేసుకుంటు రాబోయే ఎన్నికల్లోకి వెళ్తామని ఠాగూర్ అన్నారు. తాను వచ్చి కొన్ని రోజులే అవుతుందని.. రాష్ట్రస్థాయి నుంచి గ్రామస్థాయి వరకు ప్రతి ఒక్కరినీ కలుస్తానని చెప్పారు. ఎన్నికల్లో విజయాలు రావాలంటే ప్రతిసారి ఒకే స్టాటజీ ఉపయోగపడదని, పరిస్థితులను బట్టి అప్పటికప్పుడు వ్యవహరిస్తూ ఉండాలన్నారు. పీసీసీ మార్పు పై తానేమీ చెప్పలేనని, పీసీసీ మార్పు అనేది అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు.