హైదరాబాద్, వెలుగు: సిమ్ కార్డుల జారీ ప్రక్రియలో మరింత కఠిన నిబంధనలు అమలు చేసే దిశగా చర్యలు చేపడుతున్నామని టీజీ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎస్బీ) డైరెక్టర్ శిఖా గోయల్ తెలిపారు. సైబర్ మోసాలకు వినియోగిస్తున్న సిమ్బాక్స్లు, అక్రమ టెలికాం పరికరాలను గుర్తించి నిర్మూలించేందుకు టెలికాం సంస్థలతో సమన్వయం చేస్తున్నట్లు చెప్పారు. ఈ మేరకు టీజీసీఎస్బీ ఆధ్వర్యంలో టెలికాం శాఖ (డీఓటీ)తో కలిసి ఉన్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు.
సమావేశంలో డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ (ఐ4సీ), టెలికాం, ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్ల ప్రతినిధులు పాల్గొన్నారు. సైబర్ నేరాలకు సంబంధం ఉన్న అనుమానాస్పద మొబైల్ నంబర్లను వేగంగా గుర్తించి ధృవీకరించే వ్యవస్థను బలోపేతం చేయడం, కొత్త సిమ్ కార్డుల జారీ విధానాన్ని మరింత కట్టుదిట్టం చేయడంపై చర్చించారు. మోసాలకు ఉపయోగిస్తున్న మొబైల్ నంబర్లపై వినియోగదారులకు వెంటనే హెచ్చరికలు పంపడం, విదేశీ స్పూఫ్ కాల్స్, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ ( ఆధారిత మోసాలను అరికట్టే చర్యలపై నిర్ణయాలు తీసుకున్నారు.
