- ఢిల్లీలో టెస్ట్ చేసిన దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్.. టూరిస్ట్లకు తగ్గనున్న డాలర్ ఖర్చులు
- బుక్ షాప్లో తన కార్డుతో పేమెంట్ చేస్తే షాప్ ఓనర్ అకౌంట్లో రూపాయలు జమ
- టూరిస్ట్లకు తగ్గనున్న డాలర్ ఖర్చులు
న్యూఢిల్లీ: సాధారణంగా టూరిస్ట్లు విదేశీ పర్యటనల్లో చేసే ట్రాన్సాక్షన్లు డాలర్ చుట్టూనే తిరుగుతుంటాయి. తమ సొంత కరెన్సీ మొదట డాలర్గా కన్వర్ట్ అయ్యి, ఆ తర్వాత స్థానిక కరెన్సీలోకి మారుతుంది. దీంతో డబుల్ కన్వర్షన్ ఛార్జీలు, విదేశీ బ్యాంకుల ఫీజుల భారం భారీగా పడుతుంది. అయితే ఇక నుంచి డాలర్కు మారాల్సిన అవసరం లేదు. బ్రిక్స్ దేశాలు లోకల్ కరెన్సీలో వాణిజ్యాన్ని పెంచేందుకు చర్యలు తీసుకుంటుండగా, దీని పైలెట్ ప్రాజెక్ట్ సక్సెస్ అయినట్టు కనిపిస్తోంది. బ్రిక్స్ మీటింగ్కు ఇండియా వచ్చిన దక్షిణాఫ్రికా ప్రెసిడెంట్ సిరిల్ రమఫోసా ఢిల్లీలోని ఒక షాప్లో తన బ్యాంక్ కార్డును స్వైప్ చేసి పుస్తకాలు కొన్నారు. తన బ్యాంకింగ్ నెట్వర్క్ డాలర్తో సంబంధం లేకుండా నేరుగా లైవ్ ఎక్స్ఛేంజ్ రేటు (ర్యాండ్ –రూపాయి) తో లావాదేవీని పూర్తి చేసిందని ఆయన ప్రకటించారు. ట్రాన్సాక్షన్ ఎలా జరిగిందంటే.. రమఫోసా తన కార్డును స్వైప్ చేసినప్పుడు దక్షిణాఫ్రికా ర్యాండ్లు (జెడ్ఏఆర్) ఆయన బ్యాంక్ అకౌంట్ నుంచి కట్ అయ్యాయి.
ఇండియాలోని షాప్ ఓనర్ బ్యాంక్ అకౌంట్లో కరెన్సీ రేటు ప్రకారం అవి రూపాయిలుగా జమ అయ్యాయి. ఈ మధ్యలో ఏ కరెన్సీ కూడా డాలర్కు మారకపోవడం విశేషం. గ్లోబల్ ట్రేడ్లో దశాబ్దాలుగా తిరుగులేని ఆధిపత్యం చలాయిస్తున్న అమెరికన్ డాలర్కు ప్రత్యామ్నాయం సాధ్యమేనని ఈ సంఘటన నిరూపించింది. ఈ వెసులుబాటుతో లోకల్ కరెన్సీలో భారీగా వాణిజ్యం జరిగేందుకు మార్గం సుగమమైంది. ఇండియా ఇప్పటికే 'వోస్ట్రో రూపీ ఖాతాల' ద్వారా రష్యాతో రూపాయల్లోనే ట్రేడ్ చేస్తోంది. యూఏఈతో కూడా లోకల్ కరెన్సీ సెటిల్మెంట్ సిస్టమ్ (ఎల్సీఎస్ఎస్) ద్వారా చెల్లింపులు జరుగుతున్నాయి.
బ్రిక్స్ సమిట్లో ‘పేమెంట్స్’
1) ఈ- రూపాయి క్రాస్-బార్డర్ ప్రయోగం
ఆర్బీఐ అభివృద్ధి చేస్తున్న డిజిటల్ రూపాయి (ఈ–-రూపీ), చైనాకు చెందిన డిజిటల్ యువాన్ (ఈ-సీఎన్వై), యూఏఈ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీల మధ్య భవిష్యత్తులో ఇంటరాపరబిలిటీ ఎలా ఉండబోతుందనే టెక్నాలజీ నమూనాను ఫైనాన్షియల్ ట్రాక్ సమావేశాల్లో చర్చించారు. సెంట్రల్ బ్యాంకుల డిజిటల్ కరెన్సీలతో విదేశీ వ్యాపార చెల్లింపులు సులభతరం చేసే ఆలోచనను నేతలు స్వాగతించారు.
2) 'బ్రిక్స్ పే' డెమో కార్డుల ప్రదర్శన
డాలర్తో పనిలేకుండా సభ్యదేశాల మధ్య చెల్లింపుల కోసం రూపొందిస్తున్న 'బ్రిక్స్ పే' డిజిటల్ కార్డుల నమూనాలను బిజినెస్ ఫోరమ్ ఎగ్జిబిషన్లో ప్రదర్శించారు. అందులో ఆర్ఎఫ్ (రేడియో ఫ్రిక్వెన్సీ) ఐడీ ఆధారిత కార్డు ద్వారా రష్యన్ రూబుల్స్ను భారతీయ రూపాయల విలువతో మార్పిడి చేసి టెస్ట్ లావాదేవీని ప్రతినిధులకు చూపించారు.
3) యూపీఐ లైవ్ డెమో
సదస్సు ప్రాంగణంలో భారత ప్రభుత్వం ప్రత్యేకంగా 'డిజిటల్ ఇండియా / యూపీఐ ఎక్స్పీరియన్స్ కియోస్క్'లను ఏర్పాటు చేసింది. ముందుగానే డబ్బులు లోడ్ చేసిన వ్యాలెట్ కార్డులు, యాప్లను విదేశీ ప్రతినిధులు, అధికారులకు ఇచ్చి భారతీయ స్టాళ్లలో టీ, హస్తకళల వస్తువులు కొనుగోలు చేయించారు.
4) ఎన్డీబీ లోకల్ కరెన్సీ బాండ్లు
న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ (ఎన్డీబీ) చీఫ్ దిల్మా రౌసెఫ్ నేతలతో మాట్లాడుతూ.. ఇకపై ఇన్ఫ్రా ప్రాజెక్టులకు డాలర్లలో కాకుండా, భారతీయ రూపాయిలు (మసాలా బాండ్ల తరహాలో), దక్షిణాఫ్రికా ర్యాండ్లు వంటి లోకల్ కరెన్సీల్లో రుణాలు ఇచ్చే ప్రక్రియను వేగవంతం చేస్తున్నట్లు
ప్రకటించారు.
