భూముల రేట్లు రివైజ్డ్... కొత్త ప్రాజెక్టుల భూసేకరణకు రేట్ల సవరణ

భూముల రేట్లు రివైజ్డ్... కొత్త ప్రాజెక్టుల భూసేకరణకు రేట్ల సవరణ
  • అర్బన్, రూరల్  ఏరియాలకు అనామలీస్​ ​కమిటీలు
  • బహిరంగ మార్కెట్​కు అనుగుణంగా రేట్లు 
  • సవరించిన రేట్ల ప్రకారమే పరిహారం
  • భూ నిర్వాసితులకు భారీ ఊరట

యాదాద్రి, వెలుగు: భూ నిర్వాసితులకు మరింత ఊరట కలిగించేలా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కొత్త ప్రాజెక్టుల కోసం సేకరించే భూముల రేట్లను సవరించేందుకు చర్యలు తీసుకుంటోంది. అర్బన్, రూరల్​ ఏరియాలకు వేర్వేరుగా మార్కెట్​ విలువల సవరణ కోసం అనామలీస్​ కమిటీలు ఏర్పాటు చేస్తున్నారు. రేట్లను సవరించిన అనంతరం పరిహారం నిర్ణయించనున్నారు. 

తాజాగా మరిన్ని ప్రాజెక్టులు

యాదాద్రి జిల్లాలో ఇప్పటికే బస్వాపురం, గంధమల్ల రిజర్వాయర్​తో పాటు బునాదిగాని, ధర్వారెడ్డి, పిల్లాయిపల్లి కాల్వ వంటి ప్రాజెక్టులు ఉన్నాయి. వీటితో పాటు రీజినల్​ రింగ్​ రోడ్(ట్రిపుల్​ ఆర్), రైల్వే ఓవర్​ బ్రిడ్జి(ఆర్వోఆర్), ఎంఎంటీఎస్​ వంటి ప్రాజెక్టులు చేపడుతున్నారు. ఆయా ప్రాజెక్టులకు సేకరించే భూములకు నిర్ణయించిన పరిహారం నిర్వాసితుకు విడతల వారీగా అందించే ఏర్పాట్లు చేస్తున్నారు. ఆర్బిట్రేషన్​లో పెంచిన పరిహారం కూడా నిర్వాసితులకు అందిస్తున్నారు. 

తాజాగా జిల్లాలో మరిన్ని ప్రాజెక్టులకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గ్రీన్​ సిగ్నల్​ ఇచ్చాయి. చౌటుప్పల్, బీబీనగర్  మండలాల్లో కొత్తగా కాల్వల నిర్మాణం చేపట్టాలని నిర్ణయించారు. అలాగే హైదాబాద్–​-కాజీపేట రైలు మార్గంలో 110 కిలోమీటర్ల వరకు మల్టీ ట్రాకింగ్(నాలుగో లైన్) ప్రాజెక్టుకు కేంద్రం ఓకే చెప్పింది. దీంతో జిల్లాలోని బీబీనగర్  నుంచి ఆలేరు మండలం పటేల్​గూడెం వరకు 40 కిలోమీటర్ల వరకు కొత్తగా భూసేకరణ చేయాల్సి ఉంటుంది.

నాలుగేండ్ల తర్వాత..

వ్యవసాయ, కమర్షియల్​ భూములకు సంబంధించిన రిజిస్ట్రేషన్​ వాల్యూ, బహిరంగ మార్కెట్​ విలువకు మధ్య భారీ తేడా ఉంది. గత బీఆర్ఎస్​ సర్కారు 2021–2022లో భూముల విలువను సవరించింది. కాంగ్రెస్​ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇటీవలే 25 శాతం నుంచి వంద శాతానికి మించి సవరించింది. దీంతో ప్రాజెక్టుల కోసం సేకరించే భూమికి నిర్ణయించిన పరిహారం సరిపోవడం లేదని కలెక్టర్​ నేతృత్వంలోని ఆర్బిట్రేషన్​ను నిర్వాసితులు ఆశ్రయించడంతో అమౌంట్​ పెంచుతున్నారు.

రివైజ్డ్ రేట్ల ఆధారంగా పరిహారం..

అర్బన్, రూరల్​ ఏరియాల్లో కొత్తగా వచ్చిన ప్రాజెక్టులకు వ్యవసాయ, వ్యవసాయేతర​ భూసేకరణకు చెల్లించే పరిహారంపై ఈ అనామలీస్​కమిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఆయా ప్రాంతాల్లో మూడేండ్లుగా జరిగిన భూముల క్రయవిక్రయాల్లో బహిరంగ మార్కెట్​లో ఉన్న రేట్లు, రిజిస్ట్రేషన్​ మార్కెట్  వాల్యూలో ఉన్న రేట్లను పరిశీలిస్తుంది. ప్రైం ఏరియా బీబీనగర్​లో ఎకరానికి అత్యధికంగా రూ.1.60 కోట్లు ఉండగా, ఇదే మండలం రూరల్​ ఏరియాలో రూ.50 లక్షల వరకు ఉంది. భువనగిరిలో హయ్యస్ట్​గా రూ.1.16 కోట్లుగా ఉంది. చౌటుప్పల్​ మండలంలో రూ. 50 లక్షల నుంచి రూ. 88.93 లక్షలుగా ఉంది. 

జిల్లాలో ఏ మూలకు వెళ్లినా రూ.20 లక్షలకు తక్కువ లేదు. అయితే కొత్త ప్రాజెక్టుల కోసం ఇప్పుడు సేకరించే భూమి రిజిస్ట్రేషన్​ వాల్యూ, బహిరంగ మార్కెట్​ విలువను పరిశీలించి ఈ కమిటీలు ధరలను సవరిస్తాయి. ఉన్నతాధికారులకు ఓకే చేశాకే రేట్లు ఖరారు అవుతాయి. కొత్తగా నిర్ణయించిన రేటు ప్రకారం పరిహారం నిర్ణయిస్తారు. అది తక్కువని నిర్వాసితులు  భావిస్తే.. కలెక్టర్  నేతృత్వంలోని ఆర్బిట్రేషన్​ను ఆశ్రయించే అవకాశం ఉంది. పరిహారం నిర్ణయించిన తర్వాత రూరల్  ఏరియాల్లో మూడు రెట్లు, అర్బన్​ ఏరియాల్లో రెండు రెట్ల డబ్బులు నిర్వాసితులకు అందుతాయి.

సవరణకు అనామలీస్​ కమిటీలు..

ఇటీవలే భూముల విలువలను సవరించినా.. బహిరంగ మార్కెట్​కు రిజిస్ట్రేషన్​ విలువకు తేడా కొనసాగుతూనే ఉంది. అయితే జిల్లాకు కొత్తగా ప్రాజెక్టులు మంజూరు కావడంతో భూముల మార్కెట్  విలువలను పరిశీలించి సవరించేందుకు అనామలీస్​ కమిటీలు ఏర్పాటు చేసింది. 

అర్బన్​ ఏరియాల్లో కలెక్టర్​ చైర్మన్​గా ఏర్పాటు చేసే కమిటీలో జిల్లా​రిజిస్ట్రార్, ఆడిట్​ రిజిస్ట్రార్,​ మున్సిపల్​ కమిషనర్, ఎగ్జిక్యూటీవ్​ ఇంజనీర్​ ఉంటారు. హెచ్ఎండీఏ పరిధిలో వీరితో పాటు మరో ఆఫీసర్​ ఉంటారు. గ్రామీణ ప్రాంతాల్లో అడిషనల్​​ కలెక్టర్(రెవెన్యూ) చైర్మన్​గా ఏర్పాటు చేసే కమిటీలో సబ్​ రిజిస్ట్రార్, తహసీల్దార్, ఎంపీడీవోలు సభ్యులుగా ఉంటారు.