గుడిహత్నూర్, వెలుగు : అత్తగారింటిపై కక్ష పెంచుకున్న ఓ అల్లుడు ఏకంగా ఆ ఇంటికే నిప్పుపెట్టాడు. ఈ ఘటన ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో జరిగింది. గుడిహత్నూర్ కు చెందిన కడమంచి రాజమణికి ముగ్గురు కుమార్తెలు, ఒక కొడుకు ఉన్నారు. అదే గ్రామానికి చెందిన వస్తాద్ అరుణ్.. రాజమణి చిన్న కుమార్తె శ్రుతిని రెండేండ్ల కింద ప్రేమ వివాహం చేసుకున్నాడు.
రోజూ మద్యం తాగొచ్చి భార్యను కొడుతుండేవాడు. ఈ నెల 8న అత్త, భార్యతో అరుణ్ గొడవ పడి, చంపేస్తానని బెదిరించాడు. దీంతో రాజమణి చిన్న కుమార్తెతో కలిసి హైదరాబాద్లో ఉంటున్న మరో కుమార్తె వద్దకు వెళ్లిపోయింది. కోపం పెంచుకున్న అరుణ్ శనివారం రాత్రి రాజమణి ఇంటికి వెళ్లి.. డోర్లు పగులగొట్టి లోపల డీజిల్ చల్లి నిప్పు పెట్టాడు.
పొగలు, మంటలు రావడంతో ఇరుగుపొరుగు వారు గమనించి అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. ఫైర్ సిబ్బంది వచ్చేలోపే ఇంట్లోని సామగ్రి మొత్తం కాలిబూడిదైంది. స్థానికుల ద్వారా సమాచారం తెలుకున్న రాజమణి గుడిహత్నూర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాలిపోయిన సామగ్రి విలువ సుమారు రూ.2 లక్షల వరకు ఉంటుందని బాధితురాలు తెలిపింది. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడు అరుణ్ను రిమాండ్కు తరలించినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు.
