- విండీస్తో వన్డేలకు గిల్ డిప్యూటీగా సీనియర్ బ్యాటర్
- హార్దిక్ ఫిట్నెస్పై సెలెక్టర్ల ఫోకస్
న్యూఢిల్లీ: వెస్టిండీస్తో మూడు వన్డేల సిరీస్కు టీమిండియా వైస్ కెప్టెన్గా సీనియర్ బ్యాటర్ కేఎల్ రాహుల్ ఎంపికయ్యే అవకాశం ఉంది. శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో బరిలోకి దిగే భారత జట్టును సెప్టెంబర్ 16న సెలెక్షన్ కమిటీ ఎంపిక చేయనుంది. సెప్టెంబర్ 27న తిరువనంతపురంలో తొలి వన్డే జరగనుండగా.. 30న గువాహటి, అక్టోబర్ 3న ముల్లన్పూర్లో మిగతా మ్యాచ్లు జరుగుతాయి.
రెగ్యులర్ వన్డే వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ఆసియా గేమ్స్లో టీ20 జట్టుకు నాయకత్వం వహించేందుకు జపాన్ వెళ్లనున్నాడు. దీంతో అతని స్థానంలో రాహుల్కు వైస్ కెప్టెన్సీ దక్కే అవకాశముంది. ఇషాన్ కిషన్ కూడా ఆసియా గేమ్స్లో ఆడనుండటంతో రాహుల్కు బ్యాకప్ వికెట్కీపర్గా రిషబ్ పంత్, ధ్రువ్ జురెల్లో ఒకరిని ఎంపిక చేయనున్నారు. పంత్ను వన్డే జట్టుకు ఎంపిక చేయకపోతే జమ్మూకాశ్మీర్తో జరిగే ఇరానీ కప్లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు కెప్టెన్గా వ్యవహరించే అవకాశం ఉంది. పంత్ వన్డే టీమ్లోకి వస్తే జురెల్కు ఆ బాధ్యత దక్కొచ్చు.
హార్దిక్ ఫిట్నెస్పైనే ఫోకస్
పేస్ బౌలింగ్ ఆల్రౌండర్ స్థానంలో హార్దిక్ పాండ్యా అందుబాటుపై సందిగ్ధత నెలకొంది. సెప్టెంబర్ 20 నుంచి పోటీ క్రికెట్ ఆడేందుకు అతను ఫిట్గా ఉంటాడని బీసీసీఐ వర్గాల సమాచారం. మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, గుర్నూర్ బ్రార్, ప్రిన్స్ యాదవ్ పేస్ ఆప్షన్లుగా అందుబాటులో ఉన్నారు. శ్రేయస్ గైర్హాజరీలో రుతురాజ్ గైక్వాడ్కు అవకాశం దక్కొచ్చు. మరోవైపు హర్ష్ దూబే, సూర్యాంశ్ షెడ్గే, మొహ్సిన్ ఖాన్, వెంకటేశ్ అయ్యర్, హర్షిత్ రాణా, షాబాజ్ అహ్మద్ గాయాలతో సెలెక్షన్కు అందుబాటులో లేరు. ఇరానీ కప్ రెస్ట్ ఆఫ్ ఇండియా జట్టులో సర్ఫరాజ్ ఖాన్, సనత్ సంగ్వాన్, ఆయుష్ దోసేజా, రవిచంద్రన్ స్మరణ్కు చోటు దక్కే అవకాశముంది.
