- సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి కవిత సమక్షంలో చేరిక
- అక్టోబర్లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ
హైదరాబాద్, వెలుగు: ఆదిలాబాద్జిల్లాలోని ప్రముఖ నాగోబా దేవాలయ ప్రధాన పూజారి మెస్రం ఆనందరావు తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) పార్టీలో చేరారు. ఆదివారం బంజారాహిల్స్ లోని పార్టీ ఆఫీసులో సర్పంచులు, ముఖ్య నాయకులతో కలిసి ఆయన పార్టీలో జాయిన్ అయ్యారు. వారికి టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కవిత నాగోబా భక్తురాలు కావడంతో.. ఆదిలాబాద్ పర్యటనకు వెళ్లిన ప్రతిసారి నాగోబా ఆలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేస్తారు.
ఈ క్రమంలో ఆ ఆలయ ప్రధాన పూజారి పార్టీలో చేరడం తమకు మంచి పరిణామమని కవిత అంటున్నారు. మెస్రం ఆనందరావుతోపాటు గిన్నెర గ్రామ సర్పంచ్ మెస్రం భీంరావు, ముత్తనూరు సర్పంచ్ రిట్టె విఠల్, ఆసోద సర్పంచ్ నగేశ్ తదితరులు టీఆర్ఎస్లో చేరారు. కార్యక్రమంలో బోథ్ మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు తదితరులు పాల్గొన్నారు.
గోండులు, బంజారాలపై ఫోకస్
అక్టోబర్లో ఇంద్రవెల్లి కేంద్రంగా భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు కవిత కసరత్తులు చేస్తున్నారు. నిజామాబాద్ లో నిర్వహించిన పాంచజన్య సంకల్ప సభ సక్సెస్ కావడంతో ఈ నెల 20న తొలుత కొడంగల్ నియోజకవర్గంలోని కోస్గిలో మరో సభకు సన్నాహకాలు చేస్తున్నారు. ఆ తర్వాత అక్టోబర్ లో ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు. కొడంగల్ సభ తర్వాత ఇంద్రవెల్లి సభ తేదీని ప్రకటించనున్నారు. ఈ సభ ద్వారా ఆదివాసీలు, ముఖ్యంగా గోండులు, బంజారాలను పెద్ద సంఖ్యలో పార్టీలో చేర్చుకునేలా కవిత కసరత్తులు చేస్తున్నట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
