తెలంగాణ ఇక.. డిఫెన్స్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..రాష్ట్రంలో డ్రోన్ తయారీ, టెస్టింగ్ కారిడార్కు ప్రణాళికలు: శ్రీధర్ బాబు

తెలంగాణ ఇక.. డిఫెన్స్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..రాష్ట్రంలో డ్రోన్ తయారీ, టెస్టింగ్  కారిడార్కు ప్రణాళికలు: శ్రీధర్ బాబు
  • రూ.850 కోట్లతో మహేశ్వరంలో జేఎస్ డబ్ల్యూ యూఏవీ ఫెసిలిటీ
  • భూమి పూజలో పాల్గొన్న మంత్రి
  • ఏటా 300 వీబీఏటీ డ్రోన్ల ఉత్పత్తి.. 300 మందికి ఉద్యోగాలు  

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణను ‘డిఫెన్స్ స్ట్రాటజిక్ హబ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఆఫ్ ఇండియా’గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో సమగ్రమైన రోడ్ మ్యాప్ రూపొందిస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు వెల్లడించారు. అడ్వాన్స్ డ్ అన్ మ్యాన్డ్ ఏరియల్ సిస్టమ్స్, డిఫెన్స్ ఇన్నొవేషన్ లో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్ గా మార్చేలా ‘ఎకోసిస్టం’ను దశలవారీగా అభివృద్ధి చేస్తున్నామన్నారు.

 రాష్ట్రంలో డ్రోన్ మ్యాన్యుఫ్యాక్చరింగ్, టెస్టింగ్ కారిడార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఏర్పాటుకు ప్రణాళికలు తయారు చేస్తున్నామని తెలిపారు. మంగళవారం జేఎస్ డబ్ల్యూ, షీల్డ్ ఏఐ సంస్థలు రూ.850 కోట్లతో మహేశ్వరంలోని ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్(ఈఎంసీ)లో ఏర్పాటు చేయనున్న జేఎస్ డబ్ల్యూ అన్ మ్యాన్డ్ ఏరియల్ వెహికల్(యూఏవీ) ఫెసిలిటీ భూమి పూజకు మంత్రి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. డ్రోన్లు, శాటిలైట్లు, సైబర్ సిస్టమ్స్, ఏఐ అనేవి ఇకపై భవిష్యత్తు సాంకేతికతలు కావని, అవి ఇప్పటికే ఆధునిక యుద్ధాల నిర్వహణ వ్యవస్థలుగా మారాయన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో డ్రోన్ల తయారీలో స్వయం సమృద్ధిని సాధించడం జాతీయ భద్రతకు అత్యంత అవసరమన్నారు. 2030 నాటికి దేశీయ డిఫెన్స్ యూఏవీ, డ్రోన్ మార్కెట్ వ్యాల్యూ 4.4 బిలియన్ డాలర్లు, 5 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉందన్నారు. 

ఈ పరిస్థితులను మనకు అనుకూలంగా మార్చుకునేందుకు చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని చెప్పారు. ఎల్బిట్ సిస్టమ్స్, షీబెల్ లాంటి అంతర్జాతీయ డిఫెన్స్ దిగ్గజ సంస్థల తయారీ కేంద్రాలు హైదరాబాద్ లో ఉండటం ‘రైజింగ్ తెలంగాణ’కు నిదర్శనమన్నారు. ఈ 16 ఎకరాల స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ మ్యాన్యుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీలో ఏటా 300 వరకు వీబీఏటీ డ్రోన్లు తయారవుతాయని తెలిపారు.

 వచ్చే ఏడాది చివరి నాటికి ఇక్కడ ఉత్పత్తి మొదలవుతుందని.. ప్రొడక్షన్, రీపేర్, టెస్టింగ్ వంటివన్నీ ఒకేచోట అందుబాటులో ఉంటాయన్నారు. కొత్తగా 300 మందికి హై వ్యాల్యూ ఉద్యోగాలు లభిస్తాయన్నారు. కార్యక్రమంలో జేఎస్ డబ్ల్యూ డిఫెన్స్ ఫౌండర్ పార్థ్ జిందాల్, ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి  తదితరులు పాల్గొన్నారు.

గ్లోబల్ సమిట్ ఏర్పాట్ల పరిశీలన 

ఫ్యూచర్ సిటీ లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్ ఏర్పాట్లను మంత్రి శ్రీధర్ బాబు పరిశీలించారు. గ్లోబల్ సమిట్ వేదిక వద్ద సీఎస్, ఇతర విభాగాల ఉన్నతాధికారులతో ప్రత్యేక సమీక్ష సమావేశం నిర్వహించారు. పనులన్నీ 5వ తేదీ లోపు పూర్తి చేసి.. ఆరో తేదీన డ్రై రన్ కండక్ట్ చేయాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. 

ప్రపంచం దృష్టిని ఆకర్షించేలా.. తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం అయ్యేలా ఏర్పాట్లు చేయాలన్నారు.  చిన్న పొరపాటు కూడా జరగకుండా సమన్వయంతో పని చేయాలని సూచించారు. ఇతర దేశాలు, రాష్ట్రాల నుంచి వచ్చే డెలిగేట్స్, గెస్టులకు ఎలాంటి ఇబ్బంది రాకుండా చూసుకోవాలని చెప్పారు. పార్కింగ్, లాజిస్టిక్స్, శానిటేషన్ పై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు.