వరంగల్, వెలుగు: సీఎం రేవంత్రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో గడిచిన వెయ్యి రోజుల్లో ప్రజా సంక్షేమం, అభివృద్ధికి ప్రాధాన్యమిచ్చి ముందుకు సాగుతోందని వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు అన్నారు. మంగళవారం గ్రేటర్ వరంగల్ కాంగ్రెస్ భవన్లో డీసీసీ అధ్యక్షుడు ఇనగాల వెంకట్రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన ప్రెస్మీట్లో వారు మాట్లాడారు.
రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా బీఆర్ఎస్, బీజేపీలు అసత్య ప్రచారాలు చేస్తున్నాయని ఆరోపించారు. రైతు రుణమాఫీ, రైతు భరోసా, రూ.500 బోనస్, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, ఇందిరమ్మ ఇళ్లు, గృహజ్యోతి, కొత్త రేషన్ కార్డులు తదితర సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని తెలిపారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ, కాకతీయ మెగా టెక్స్టైల్ పార్క్, మామునూర్ ఎయిర్పోర్టు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ వంటి అభివృద్ధి పనులను చేపట్టామని పేర్కొన్నారు. సమావేశంలో నేతలు మార్క విజయ్ కుమార్, రామకృష్ణ, బంక సరళ తదితరులు పాల్గొన్నారు.
