మహాలక్ష్మి పథకం కింద మరో హామీ అమలుకు కాంగ్రెస్ ప్రభుత్వం జీవో విడుదల చేసింది. అర్హులైనవారికి రూ.500కే గ్యాస్ సిలిండర్ పథకం అమలుకు మార్గదర్శకాలను విడుదల చేసింది. తెల్లరేషన్ కార్డు ఉన్నవాళ్లకు ఈ పథకాన్ని వర్తింపజేయనున్నట్లు రేవంత్ సర్కార్ ఇప్పటికే ప్రకటించింది. ప్రజాపాలనలో దరఖాస్తు చేసుకున్నవారు ఈ పథకానికి అర్హులుగా తెలిపింది.
మహిళ పేరుపై గ్యాస్ కనెక్షన్ ఉండాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గత మూడేళ్ల వినియోగం ఆధారంగా సిలిండర్లు ఇవ్వనున్నారు. గ్యాస్ కంపెనీలకు నెలవారీగా సబ్సిడీ చెల్లిస్తామని జీవోలో ప్రభుత్వం పేర్కొంది. లబ్ధిదారులకు సబ్సిడీ డబ్బును గ్యాస్ కంపెనీలు బదిలీ చేయనున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 1.20 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉండగా, అందులో రేషన్కార్డు ఉన్న కుటుంబాల సంఖ్య 89.99 లక్షలుగా ఉంది.
ALSO READ :- యూకే ప్రధాన మహిళ అక్షతా మూర్తి సింప్లిసిటీ చుస్తే ఫిదా అవ్వాల్సిందే..!
మొత్తం సిలిండర్ ధర ముందే చెల్లించాల్సి ఉంటుంది. అందులో రూ.500 సిలిండర్కు పోను మిగిలిన అమౌంట్ లబ్ధిదారు ఖాతాలో జమ అవుతుంది. రాష్ట్రంలో ఉజ్వల గ్యాస్ కనెక్షన్ లబ్ధిదారులు 11.58 లక్షల మంది ఉన్నారు. వీరంతా మహాలక్ష్మి స్కీమ్ పరిధిలోకి రానున్నారు. ప్రభుత్వం ఇప్పటికే కంపెనీలకు ముందస్తుగా రూ.80 కోట్లు చెల్లించింది. ఈ స్కీమ్లకు ఇంకా అర్హులను గుర్తించేందుకు ప్రజాపాలన కార్యక్రమం నిరంతరం కొనసాగుతుందని, అందులో దరఖాస్తు చేసుకోవచ్చని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.