
- –ఖాళీగా ఉన్న పోస్టుల వివరాలు
- పంపాలని ఆర్థికశాఖ ఆదేశం
హైదరాబాద్, వెలుగు: వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న గ్రూప్ 1 పోస్టుల వివరాలు పంపాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. ఈ మేరకు ఫైనాన్స్ స్పెషల్ సీఎస్ కె.రామకృష్ణారావు మంగళవారం సర్య్కులర్ మెమో జారీ చేశారు. బుధవారం సాయంత్రంలోగా పూర్తి వివరాలు పంపాలని స్పష్టం చేశారు. గతేడాది మార్చిలో ఇచ్చిన జీవో నెంబర్ 26కు అదనంగా వీటిని పంపాలని పేర్కొన్నారు. రెవెన్యూ, హోం, ఆర్ అండ్ బీ, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, లేబర్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్, షెడ్యూల్డ్క్యాస్ట్ డెవలప్మెంట్, బీసీ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్, హెల్త్, మెడికల్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ శాఖల్లో గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల వెకెన్సీ పంపాలని ఆదేశించారు.
ఇదీ గ్రూప్-1 నేపథ్యం
టీఎస్పీఎస్సీ 503 గ్రూప్–1 ఉద్యోగాల భర్తీ కోసం నోటిఫికేషన్ జారీ చేసి ఇప్పటికే రెండుసార్లు ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే తాజాగా హైకోర్టు రెండోసారి నిర్వహించిన ప్రిలిమ్స్ పరీక్షను కూడా రద్దు చేయడంతో మరోసారి పరీక్ష నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీని మీద ఇప్పటివరకు టీఎస్పీఎస్సీ స్పష్టమైన ప్రకటన విడుదల చేయలేదు. అయితే నూతన ప్రభుత్వం ప్రతి యేటా ఫిబ్రవరి 1వ తేదీన గ్రూప్–1 నోటిఫికేషన్ విడుదల చేస్తామని హమీ ఇచ్చింది. ఈ నేపథ్యంలో ప్రస్తుత నోటిఫికేషన్కు అనుబంధంగా మరొక నోటిఫికేషన్ ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిసింది. అందులో భాగంగానే మరిన్ని కొలువులను యాడ్ చేయాలనుకుంటున్నది.