- రాష్ట్రంలో తాజా పరిస్థితులు, అభివృద్ధి అంశాలపై చర్చ
న్యూఢిల్లీ, వెలుగు: ఢిల్లీ పర్యటనలో ఉన్న గవర్నర్ శివ్ ప్రతాప్ శుక్లా బిజీబిజీగా గడిపారు. రాష్ట్ర గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత రెండోసారి ఆయన ఢిల్లీకి వెళ్లారు. గురువారం రాత్రి తెలంగాణ భవన్ లో బస చేశారు. శుక్రవారం ఉదయం నుంచి పలువురు కేంద్ర మంత్రులతో సమావేశం అయ్యారు. ఉదయం 8:30కు కేంద్ర కార్మిక, ఉపాధి, యువజన వ్యవహారాల శాఖ మంత్రి మన్ సూఖ్ మాండవీయతో సమావేశమయ్యారు.
కేంద్ర మంత్రి నివాసంలో జరిగిన ఈ మీటింగ్ లో రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ, ఇతర అంశాలపై చర్చించారు. మధ్యాహ్నం 12:45 నిమిషాలకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను ఆమె కార్యాలయంలో మర్యాదపూర్వకంగా సమావేశం అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలోని తాజా ఆర్థిక పరిస్థితులు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు తెలిసింది.
అమిత్ షా తో సుదీర్గంగా భేటీ
కేంద్ర హోం మంత్రి అమిత్ షాతోనూ గవర్నర్ భేటీ అయ్యారు. మధ్యాహ్నం 3:30 నిమిషాలకు కేంద్ర మంత్రిని ఆయన నివాసంలో కలిశారు. కరీంనగర్ సిల్వర్ ఫిలిగ్రీ నెమలి బొమ్మను బహుకరించారు. ఈ భేటీలో భాగంగా రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్, మైనర్ బాలికపై కేసు, ఇతర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. అనంతరం రాత్రి 7 గంటలకు కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ మేఘవాల్ తో సమావేశం అయ్యారు. ఈ భేటిలో భాగంగా న్యాయపరమైన అంశాలపై చర్చించినట్లు తెలిసింది.
