
- రూల్స్ కఠినంగా అమలు చేయాల్సిందే
- రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం
హైదరాబాద్, వెలుగు : హైదరాబాద్లోని ఫంక్షన్ హాళ్లలో సౌండ్ కంట్రోల్ చేసేందుకు రూల్స్ మరింత కఠినంగా అమలు చేయాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. శబ్ద నియంత్రణకు కేవలం సర్క్యులర్లు జారీ చేసి చేతులు దులిపేసుకుంటున్నారని అసంతృప్తి వ్యక్తం చేసింది. సౌండ్ కంట్రోల్ చేసేందుకు అమలు చేస్తున్న రూల్స్ ఏమిటో వివరిస్తూ నివేదికను సమర్పించాలని తెలిపింది. సికింద్రాబాద్ తాడ్బండ్, బోయినపల్లిలోని బాంటియా గార్డెన్స్, ఇంపీరియల్ గార్డెన్స్ ఫంక్షన్ హాళ్ల నుంచి వస్తున్న పరిమితికి మించిన శబ్దాలతో ఇబ్బందిగా ఉందని మిలిటరీ అదనపు చీఫ్ ఇంజినీరు కల్నల్ జె.సతీశ్ భరద్వాజ్ రాసిన లేఖను హైకోర్టు పిల్గా తీసుకుంది.
ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ జె.అనిల్కుమార్లతో కూడిన ధర్మాసనం శుక్రవారం విచారించింది. అదనపు అడ్వకేట్ జనరల్ మహమ్మద్ ఇమ్రాన్ఖాన్ వాదనలు వినిపిస్తూ.. శబ్ద నియంత్రణ నిబంధనలను పాటించాలని ఆదేశాలు జారీ చేసినట్లు కోర్టుకు తెలిపారు. హైదరాబాద్ సిటీలోని 70 ఫంక్షన్ హాళ్లు, కన్వెన్షన్ హాళ్లకు నోటీసులు జారీచేశామని వెల్లడించారు. దీనిపై ధర్మాసనం జోక్యం చేసుకుంటూ.. ఉత్తర్వులు జారీ చేయడంతో సరిపెట్టకుండా రూల్స్ అమలుకు చర్యలు తీసుకోవాలని ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది.