హైదరాబాద్, వెలుగు: పలు మున్సిపాలిటీ చైర్పర్సన్లపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలను అడ్డుకోవాలని కోరుతూ దాఖలైన పలు పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. సింగిల్ జడ్జి ఉత్తర్వులను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను కొట్టేస్తూ చీఫ్ జస్టిస్ అలోక్ అరాధే, జస్టిస్ అనిల్ కుమార్లతో కూడిన దివిజన్ బెంచ్ జడ్జిమెంట్ ఇచ్చింది.
సదాశివపేట చైర్పర్సన్ పి.జయమ్మ, జనగామ చైర్పర్సన్ పి.జమున, ఆందోల్–జోగిపేట చైర్మన్ జి. మల్లయ్య, జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ చైర్పర్సన్ ఎం. కావ్య, ఆలేరు మున్సిపల్ చైర్ పర్సన్ శంకరయ్య, దమ్మాయిగూడ మున్సిపల్ చైర్పర్సన్ ప్రణీతలపై కౌన్సిలర్లు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానాలపై స్టే ఇచ్చేందుకు గతంలో సింగిల్ జడ్జి నిరాకరించారు. దీంతో వారంతా అప్పీల్ దాఖలు చేసినా ప్రయోజనం లేకపోయింది.
మున్సిపల్ శాఖ అవిశ్వాసాలపై జోక్యానికి నిరాకరించింది. మున్సిపల్ కౌన్సిలర్లు ఇచ్చిన అవిశ్వాస వినతిపత్రాల ఆధారంగా అవిశ్వాస తీర్మాన నోటీసులను కలెక్టర్లు జారీ చేశారు. మున్సిపల్ చట్టం–2019లో అవిశ్వాస తీర్మానం ఆమోదించడానికి చట్టంలో తగిన నిబంధనలు లేవని పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదించారు. అవిశ్వాస తీర్మానం తర్వాత తీసుకోవాల్సిన చర్యలపైనా స్పష్టత లేదన్నారు. పాత చట్టంలోనే నిబంధనలు ఉన్నాయని, పాత కొత్త చట్టాలను కలిపి చూడడం సరికాదన్నారు.