ఖదీర్ కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం

ఖదీర్ కేసు: కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి కోర్టు ఆదేశం

మెదక్ పోలీసుల దాడిలో గాయపడి ప్రాణాలు కోల్పోయిన ఖదీర్ ఖాన్ మృతిపై హైకోర్టులో విచారణ జరిగింది. ఖదీర్ మృతిపై పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశించింది. ఖదీర్ మృతిపై మీడియాలో వచ్చిన కథనాల ఆధారంగా సుమోటోగా స్వీకరించిన హైకోర్టు.. ఈ ఘటనపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, మెదక్ ఎస్పీ, డీఎస్పీ, ఎస్ హెచ్ఓకు ఆదేశించింది. తదుపరి విచారణ మార్చి 14కు వాయిదా వేసింది. 

గత నెల 27న చైన్ స్నాచింగ్ కేసులో ఖదీర్‭ను మెదక్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారని అడిషనల్ అడ్వకేట్ జనరల్ కోర్టుకు తెలిపారు. ఈనెల 3న అతడు పోలీస్ కస్టడీ నుండి బయటకు వచ్చినట్లు చెప్పారు. కోర్టులో హాజరుపరిచిన 14 రోజులకు ఖదీర్ మరణించినట్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇదిలా ఉంటే.. ఖదీర్ మృతికి పోలీసులే కారణమని మీడియాలో కథనాలు వచ్చాయి. ఖదీర్ పై పోలీసులు థర్డ్ డిగ్రీ ప్రయోగించినట్లు ఆరోపణలు వచ్చాయి. దీంతో ఈ ఘటనపై హైకోర్టు జోక్యం చేసుకుంది. దీనిపై పూర్తి వివరాలు తెలియజేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.