
తెలంగాణ హైకోర్టు జడ్జి గిరిజాప్రియదర్శిని కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె మే 4న తుది శ్వాస విడిచారు. మే 5న మధ్యాహ్నం మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరగనున్నాయి. గిరిజాప్రియదర్శిని మృతిపట్ల తోటి జడ్జిలు, న్యాయవాదులు,హైకోర్టు సిబ్బంది సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
వైజాగ్ కు చెందిన గిరిజాప్రియదర్శిని 1995లో న్యాయవాదిగా ఎన్ రోల్ అయ్యారు. విశాఖ జిల్లా కోర్టులో ఏడు సంవత్సరాలు ప్రాక్టీస్ చేశారు. 2008లో తొలిసారిగా అదనపు జడ్జిగా బాధ్యతలు చేపట్టారు.
2017లో ఒంగోలు జిల్లా కోర్టు చీఫ్గా పదోన్నతి పొందారు. ఖమ్మం ఫ్యామిలీ కోర్టులో మూడేండ్లు, విజయనగరం మొదటి అదనపు జిల్లా జడ్జిగా, నంద్యాలలో అదనపు జిల్లా జడ్జిగా పనిచేశారు.గిరిజాప్రియదర్శిని ఆదిలాబాద్,కరీంనగర్ జిల్లా కోర్టు చీఫ్ జడ్జిగా కూడా పని చేశారు.
2022లో తెలంగాణ హైకోర్టు జడ్జిగా బాధ్యతలు స్వీకరించారు. అంతకంటే ముందు గిరిజా ప్రియదర్శిని రాష్ట్ర లీగల్ సెల్ సర్వీసెస్ అథారిటీ సెక్రటరీగా కూడా పనిచేశారు.