ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఎమ్మెల్యే దానం నాగేందర్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు

ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఎన్నిక చెల్లదంటూ ఆయన ప్రత్యర్థి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ జరిపింది. జస్టిస్ విజయసేన్ రెడ్డి నేతృత్వంలోని ధర్మాసనం విచారణకు స్వీకరించింది. దీనిపై దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. 

దానం నాగేందర్  అసెంబ్లీ  ఎన్నికల సమయంలో ఓటర్లను ప్రలోభాలకు గురి చేశారని విజయారెడ్డి తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. ఓటర్లకు డబ్బులు పంచారని, ఈ విషయంలో కేసులు నమోదయ్యాయని కోర్టుకు వివరించారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం దానం నాగేందర్ కు నోటీసులు జారీ చేసింది. 

2023 అసెంబ్లీ ఎన్నికల్లో  ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరుపున పోటీ చేసిన దానం నాగేందర్ ..  బీజేపీ అభ్యర్థి చింతల రామచంద్రారెడ్డిపై గెలిచారు.  2024 మార్చి 17న బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.  రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో దానం నాగేందర్ ను సికింద్రబాద్ ఎంపీ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రకటించింది.