
హైదరాబాద్, వెలుగు: అనారోగ్యం కారణంగా ఇటీవల కన్నుమూసిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ మాటూరి గిరిజా ప్రియదర్శిని(61)కి ఫుల్ కోర్టు నివాళులు అర్పించింది. మొదటి కోర్టు హాల్లో యాక్టింగ్ చీఫ్ జస్టిస్ సుజయ్పాల్ అధ్యక్షతన మంగళవారం హైకోర్టులోని న్యాయమూర్తులు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. జస్టిస్ ప్రియదర్శిని ఆత్మకు శాంతి చేకూరాలని రెండు నిమిషాలు మౌనం పాటించారు.
ఆమె చెప్పిన కీలక తీర్పులను అడ్వొకేట్ జనరల్ ఎ.సుదర్శన్రెడ్డి గుర్తు చేశారు. కార్యక్రమంలో న్యాయమూర్తులు, అడిషనల్ సొలిసిటర్ జనరల్ నర్సింహ శర్మ, పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్రావు, బార్ కౌన్సిల్ చైర్మన్ ఎ.నరసింహారెడ్డి, డిప్యూటీ సొలిసిటర్ జనరల్ గాడి ప్రవీణ్కుమార్, హెచ్సీఏఏ అధ్యక్షుడు జగన్, జస్టిస్ పియదర్శిని కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. అనంతరం హైకోర్టు అడ్వొకేట్స్ అసోసియేషన్ హాల్లో జరిగిన కార్యక్రమంలో జస్టిస్ ప్రియదర్శినికి న్యాయవాదులు నివాళులర్పించారు. జస్టిస్ సుజయ్పాల్ హాజరయ్యారు.