వెబ్​సైట్​ కథనాలపై కేసులో మేఘాకు షాక్​

వెబ్​సైట్​ కథనాలపై కేసులో మేఘాకు షాక్​
  • పత్రికల గొంతు నొక్కే ఉత్తర్వులు చెల్లవు
  • కింది కోర్టు ఆర్డర్​ను రద్దు చేసిన హైకోర్టు
  • ఇటీవల తీర్పు వెలువరించిన డివిజన్ బెంచ్

హైదరాబాద్, వెలుగు: పత్రికల గొంతు నొక్కేలా ఎలాంటి ఆదేశాలు ఇచ్చినా చెల్లదని హైకోర్టు తీర్పు వెలువరించింది. జాతీయ భద్రతతో పాటు ఇతర కొన్ని ప్రమాదకరమైన సందర్భాల్లో మాత్రమే గ్యాగ్‌‌ ఆర్డర్లకు ఆస్కారం ఉంటుందని సుప్రీం కోర్టు స్పష్టం చేసిందని గుర్తు చేసింది. 2022లో తొలి వెలుగు వెబ్‌‌సైట్, యూట్యూబ్‌‌ చానల్‌‌పై ట్రయల్‌‌కోర్టు ఇచ్చిన గ్యాగ్‌‌ ఉత్తర్వును రద్దు చేసింది. వెబ్‌‌సైట్‌‌లో వీడియోలు, చిత్రాలను, నివేదికలు, ప్రచురణలు, వ్యంగ్య చిత్రాలు ప్రచురించడాన్ని, ప్రసారం చేయడాన్ని నిలిపివేయాలని కోరుతూ మేఘా ఇంజనీరింగ్‌‌ అండ్‌‌ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్‌‌ లిమిటెడ్‌‌ కూకట్‌‌పల్లి కోర్టులో కేసు వేసింది. 

ఇందుకు అనుకూలంగా కింది కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 2022, డిసెంబర్‌‌ 2న కూకట్‌‌పల్లి కోర్టు ఇచ్చిన ఈ గ్యాగ్‌‌ అర్డర్‌‌ను సవాల్‌‌ చేస్తూ వెబ్‌‌సైట్, యూట్యూబ్‌‌ నిర్వాహకులు హైకోర్టులో సవాల్‌‌ చేసిన పిటిషన్లపై న్యాయమూర్తులు జస్టిస్‌‌ టి.వినోద్‌‌కుమార్, జస్టిస్‌‌ పీ శ్రీసుధలతో కూడిన డివిజన్‌‌ బెంచ్‌‌ ఇటీవల తీర్పు చెప్పింది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌‌ 19(1)(ఏ), 19(1)(జీ)లకు వ్యతిరేకంగా కింది కోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పిటిషనర్ల వాదన.