
హైదరాబాద్, వెలుగు: సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని ఎన్నిసార్లు చెప్పినా మీరు మారరా? అంటూ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ‘‘సివిల్ కోర్టుల్లో వివాదం ఉంటే మీరెందుకు జోక్యం చేసుకుంటారు? చట్టం చెప్పిన విధులుకాకుండా అన్నీ మీరే చేస్తారా? అలాగైతే చట్టాలను సవరణ చేయించుకుని అధికారాలు పొందండి.. అంతేగానీ ఉన్న చట్టాల్లోని నిబంధనలను ఎలా ఉల్లంఘిస్తారు?’’అని హైకోర్టు నిలదీసింది. హైదరాబాద్ బార్కాస్లోని 256 గజాల ఇంటి స్థలానికి సంబంధించి సివిల్ కోర్టులోని సూట్ ఉపసంహరణకు ఒత్తిడి చేయడాన్ని సవాల్ చేస్తూ మోహ్షిన్ బఫానా.. హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని జస్టిస్ టి.వినోద్ కుమార్ విచారించారు. ‘‘సివిల్ కోర్టులో ఉన్న దావాను ఉపసంహరించుకోవాలని ఎలా చెప్తారు? పోలీసులను చూసి సామాన్యులు భయపడుతున్నరు.
ఫ్రెండ్లీ పోలీసింగ్ అనడం తప్ప ఆచరణలో అమలుకావడం లేదు. రోజుకు 30 పిటిషన్లు దాఖలవుతుంటే అందులో 25 సివిల్ వివాదాల్లో జోక్యానికి సంబంధించిన ఆరోపణలతోనే ఉంటున్నాయి. ఫిర్యాదు అందిన వెంటనే నోటీసు, ప్రాథమిక విచారణ లేకుండా కేసు నమోదు చేసి వేధింపులు మొదలుపెట్టడం ఏంటి?’’అని పోలీసులను జస్టిస్ టి.వినోద్ కుమార్ నిలదీశారు. హైదరాబాద్ సిటీ పోలీసు చట్టం ప్రకారం విధులు నిర్వర్తించాలంటూ గతంలో హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసినా పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ‘‘చట్టంలోని విధుల నిర్వహణలో కాకుండా పోలీసులు కొత్త పాత్రలు పోషిస్తూ అదనపు విధులు నిర్వహిస్తున్నారు.
సివిల్ వివాదంలో జోక్యం చేసుకున్న అధికారిపై చర్యలు తీసుకోవాలని కమిషనర్కు ఆదేశాలిస్తాం’’అని జస్టిస్ వినోద్ కుమార్ అన్నారు. ప్రభుత్వ న్యాయవాది జోక్యం చేసుకుంటూ.. ఇక నుంచి పోలీసులు సివిల్ వివాదంలో జోక్యం చేసుకోరని తెలిపారు. ఇప్పటికే ఎఫ్ఐఆర్ నమోదైనందున చట్టప్రకారం దర్యాప్తు చేస్తారని హామీ ఇచ్చారు. జడ్జి స్పందిస్తూ.. ఫిర్యాదులో పేర్కొన్న దాడికి సంబంధించిన క్రిమినల్ కేసుపై మాత్రమే చట్టప్రకారం దర్యాప్తు చేపట్టాలని, సివిల్ వివాదాల్లో జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించారు.