అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్‌‌..ఇది కేసీఆర్ ఘనతే: మంత్రి జగదీశ్‌‌ రెడ్డి

అన్ని వర్గాలకు 24 గంటల కరెంట్‌‌..ఇది కేసీఆర్ ఘనతే: మంత్రి జగదీశ్‌‌ రెడ్డి

హైదరాబాద్‌‌, వెలుగు : వినియోగదారులందరికీ నిరంతర విద్యుత్‌‌ను అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని ఆ శాఖ మంత్రి జగదీశ్‌‌ రెడ్డి అన్నారు. శుక్రవారం స్టేట్ పవర్ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జెన్‌‌కో ఆడిటోరియంలో మోక్షగుండం విశ్వేశ్వరయ్య 163వ జయంతిని పురస్కరించుకుని 56వ ఇంజనీర్స్ డే ఉత్సవాలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి జగదీశ్‌‌ రెడ్డి, డిస్కంల సీఎండీలు జి.రఘుమా రెడ్డి, అన్నమనేని గోపాల్ రావు హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ 24 గంటల విద్యుత్‌‌ను అన్ని రకాల వినియోగదారులకు అందిస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని తెలిపారు.

ALSO READ: ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో.. వీక్లీ, మంత్లీ ఎగ్జామ్స్

రైతులకు ఉచితంగా విద్యుత్తు అందిస్తున్న రాష్ట్రం కూడా తెలంగాణేనని పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో మెడికల్ కాలేజీలు పెట్టిన వ్యక్తి సీఎం కేసీఆర్ అని కొనియాడారు. రాష్ట్ర ప్రగతి సాధన కోసం అన్ని కాలాల్లో 24 గంటల విద్యుత్తు ఇవ్వడంలో సీఎం కేసీఆర్‌‌‌‌ కృషి ఎంతో ఉందని తెలిపారు. ఈ సందర్భంగా ఇంజినీర్లందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నానని తెలిపారు.

ఈ కార్యక్రమంలో పవర్‌‌ ఇంజినీర్స్‌‌ ప్రెసిడెంట్ రత్నాకర్ రావు, సెక్రటరీ జనరల్ సదానందం, వెంకట్ నారాయణ రెడ్డి, విద్యుత్ సంస్థల్లోని డైరెక్టర్లు, సీనియర్ ఇంజినీర్లు, రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి టీఎస్ జెన్‌‌కో, టీఎస్ ట్రాన్స్‌‌కో, టీఎస్‌‌ఎస్పీడీసీఎల్, టీఎస్ ఎన్పీడీసీఎల్‌‌కి సంబంధించిన ఇంజినీర్లు పాల్గొన్నారు.