హైదరాబాద్, వెలుగు: తెలంగాణ స్కూల్ ఎడ్యుకేషన్ సేవలన్నీ త్వరలో ఆన్లైన్లోకి మారనున్నాయి. దీనికి సంబంధించి విద్యాశాఖాధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇప్పటికే రాష్ట్రంలో వివిధ సంస్థల పరిధిలోని 42,421 స్కూళ్లలోని 2,63,469 మంది టీచర్ల వివరాలను సేకరించి వెబ్సైట్లో పొందుపర్చారు. వీరిలో అత్యధికంగా సర్కారు, లోకల్బాడీ స్కూళ్లకు చెందిన 1,19,595 మంది ఉండగా, ప్రైవేటు బడులకు చెందినవారు 1,16,564 మంది ఉన్నారు. దీనికితోడు స్టేట్లోని 60,01,680 మంది స్టూడెంట్స్ యూడైస్ లెక్కలనూ వెబ్సైట్లో పెట్టేందుకు సిద్ధం చేశారు. సర్కారు టీచర్లకు సంబంధించిన మెడికల్ బిల్స్, టీచర్ సర్వీస్బుక్స్, లీవ్స్, ఫారిన్టూర్స్ లీవ్స్… అన్నీ ఆన్లైన్ ద్వారానే చేయాలని అధికారులు భావిస్తున్నారు. టీయాప్తో ఇప్పటికే టీచర్లు, స్టూడెంట్స్ వివరాలను సేకరిస్తున్నారు. వీటిని వెబ్సైట్కు అనుసంధానం చేయాలనే ఆలోచనలో అధికారులున్నారు. ప్రైవేటు మేనేజ్మెంట్ల పర్మిషన్లు కూడా ఆన్లైన్లోనే ఇవ్వనున్నారు. స్కూల్ ఎడ్యుకేషన్ వెబ్సైట్ను అధికారికంగా త్వరలోనే అందరికి అందుబాటులోకి తీసుకురానున్నట్టు ఆ శాఖ కమిషనర్ విజయ్కుమార్ తెలిపారు.