ఆర్ఎఫ్సీఎల్ యూరియా 70% రాష్ట్రానికే ఇవ్వండి : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు

ఆర్ఎఫ్సీఎల్ యూరియా 70%  రాష్ట్రానికే ఇవ్వండి : మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు
  •     కేంద్రాన్ని కోరిన వ్యవసాయ మంత్రి తుమ్మల
  •     మంత్రి శ్రీధర్​బాబుతో కలిసి ఆర్ఎఫ్​సీఎల్ అధికారులతో సమీక్ష

హైదరాబాద్‌, వెలుగు: రామగుండం ఎరువుల కర్మాగారం (ఆర్ఎఫ్​సీఎల్​)లో ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందుతాయని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్​రావు అన్నారు. మంగళవారం ఆర్ఎఫ్​సీఎల్​లో యూరియా ఉత్పత్తి, సరఫరా అంశాలపై పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి శ్రీధర్‌బాబుతో కలిసి ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. 

గత వానాకాలం సీజన్‌లో ఉత్పత్తికి ఎదురైన ఆటంకాలు పునరావృతం కాకుండా తీసుకుంటున్న చర్యలపై మంత్రులు ఆరా తీశారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల మాట్లాడుతూ, గత వానాకాలంలో రామగుండం ఫ్యాక్టరీలో ఉత్పత్తి నిలిచిపోవడంతో రాష్ట్ర రైతులు యూరియా కొరతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని గుర్తు చేశారు. 

కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ నుంచి 2,05,315 టన్నుల కేటాయింపులు ఉన్నప్పటికీ, 1,10,720 టన్నులు మాత్రమే సరఫరా కావడంతో భారీ లోటు ఏర్పడిందన్నారు. ఈ లోటును భర్తీ చేయాలని పలుమార్లు కేంద్రాన్ని కోరినా సమయానికి స్పందన లేకపోవడంతో రైతులు నష్టపోయారని తెలిపారు. యాసంగి సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని ఆర్ఎఫ్​సీఎల్ తీసుకుంటున్న ఏర్పాట్లపై పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బాబు సమీక్షించారు. 

ఉత్పత్తిలో ఎలాంటి అవాంతరాలు రాకుండా చేపడుతున్న చర్యలపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. దీనికి స్పందించిన కంపెనీ ప్రతినిధులు, గత వానాకాలంలో హెచ్​టీఆర్​లో ఏర్పడిన టెక్నికల్ సమస్యలతో ఉత్పత్తి నిలిచిపోయిందని తెలిపారు. 

ఈ యాసంగిలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నామని.. అక్టోబర్‌, నవంబర్‌ నెలల్లో కేటాయింపుల మేరకు యూరియా సరఫరా చేశామని చెప్పారు. డిసెంబర్‌ నెలలో 50,450 టన్నుల యూరియా సరఫరా చేయనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా తుమ్మల మాట్లాడుతూ రామగుండంలో నెలకు సుమారు లక్ష టన్నుల యూరియా ఉత్పత్తి అవుతున్నప్పటికీ రాష్ట్రానికి 40–50 శాతం మాత్రమే కేటాయింపులు జరుగుతున్నాయని తెలిపారు. 

ఇక్కడ ఉత్పత్తి అయ్యే యూరియాలో కనీసం 70 శాతం తెలంగాణకే కేటాయిస్తే రవాణా ఖర్చులు తగ్గి, రైతులకు వేగంగా ఎరువులు అందుతాయని స్పష్టం చేశారు. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి లెటర్ రాయాలని పరిశ్రమల శాఖ ఎండీని మంత్రి  శ్రీధర్‌బాబు ఆదేశించారు. ఉత్పత్తిలో ఎలాంటి ఆటంకాలు వచ్చినా ప్రత్యామ్నాయ ప్రణాళికతో సిద్ధంగా ఉండాలని కంపెనీ ప్రతినిధులకు మంత్రులు సూచించారు. ఈ సమావేశంలో పరిశ్రమల శాఖ కార్యదర్శి, పరిశ్రమల శాఖ ఎండీ, టీజీఐడీసీ ఎండీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ  ప్రతినిధులు పాల్గొన్నారు.