అపెక్స్ మీటింగ్ తప్పించుకునేందుకే కేబినెట్!

అపెక్స్  మీటింగ్ తప్పించుకునేందుకే కేబినెట్!
  • మంత్రి మండలి భేటి ఎజెండాలో ఏపీ ప్రాజెక్టుల ముచ్చట్నే లేదు
  • దక్షిణ తెలంగాణ ఎడారి అవుతున్నా లైట్ తీసుకుంటున్న సర్కార్
  • కేబినెట్ భేటీ ఉంది కాబట్టే అపెక్స్  వాయిదా వేయాలని త్వరలో కేంద్రానికి లేఖ
  • మొత్తం దృష్ణంతా కొత్త సెక్రటేరియట్ పైనే

అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నుంచి తప్పించుకునేందుకు రాష్ట్ర సర్కార్ ప్లాన్ చేస్తుందన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇందు కోసమే కేబినెట్ సమావేశాన్ని ముందుకు తెచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏపీ ప్రాజెక్టులకు లోలోపల సపోర్ట్ చేస్తున్న కేసీఆర్ సర్కార్ వాటి టెండర్ల ప్రక్రియ ముగిసే వరకు ఎలాంటి అడ్డంకి ఎదురు కాకుండా జాగ్రత్త పడుతోందన్న ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర కేబినెట్ భేటీ ఉంది కాబట్టి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ వాయిదా వేయాలని కేంద్రాన్ని కోరనుందని ఈ మేరకు లెటర్ రాయడానికి రెడీ అవుతోందని అంటున్నారు. కేబినెట్ సమావేశమవుతున్నా దక్షిణ తెలంగాణను ఏడారిగా మార్చే పోతిరెడ్డిపాడు ముచ్చటే ఎజెండాలో చేర్చలేదని..అంటే పాలమూరు,నల్గొండ, రంగారెడ్డి,ఖమ్మం జిల్లాలకు తీవ్ర నష్టం వాటిల్లుతున్నా మన సర్కార్ లైట్ తీసుకుంటుందని తప్పుపడుతున్నరు.

ఎప్పుడో సమాచారం ఇచ్చినా…

తెలంగాణ ఏపీ మధ్య జల వివాదాలను పరిష్కరించేందుకు ఈ నెల 5న అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ నిర్వహిస్తామని కేంద్ర జలశక్తి శాఖ రెండు రాష్ట్రాలకు సమాచారం ఇచ్చింది. ఈ మేరకు జులై 28 వ తేదీనే కేంద్రజలశక్తి శాఖ కార్యదర్శి యూపీ సింగ్ రెండు రాష్ట్రాలకు లెటర్ రాశారు. ఈ లెటర్ పై జులై 30న రివ్యూ చేసిన సీఎం కేసీఆర్.. ఆగస్టు5న ముందే నిర్ణయించిన అధికారిక కార్యక్రమాలు ఉన్నాయని, 20వ తేదీ తర్వాత నిర్వహించాలంటూ కేంద్రానికి లెటర్ రాయాలని అధికారులను ఆదేశించారు. కేంద్రానికి లెటర్ రాయాలి కాబట్టి అదే రోజున రాష్ట్ర కేబినెట్ భేటీ నిర్వహిస్తున్నట్టుగా సీఎంవో నుంచి శనివారం ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఐదో తేదీన రాష్ట్ర కేబినెట్ మీటింగ్ ఉన్నందున అపెక్స్ కౌన్సిల్ కు హాజరవడం సాధ్యం కాదని కేంద్రానికి లెటర్ రాసేందుకు సిద్ధమైనట్టు తెలిసింది. స్వాతంత్ర్య దినోత్సవం, ఇతరత్రా కార్యక్రమాలన్నీ పూర్తయ్యాక 20వ తేదీ తర్వాత మరో డేట్ నిర్ణయించి అపెక్స్ కౌన్సిల్ పెట్టాలని సూచించనున్నట్టు సమాచారం.

సెక్రటేరియట్ హంగులపైనే..

సెక్రటేరియట్ డిజైన్లపై చర్చించేందుకే ఐదో తేదీన కేబినెట్ సమావేశం నిర్వహిస్తున్నారు. సెక్రటేరియట్ తో పాటు నియంత్రిత సాగు,కరోనా వ్యాప్తి నేపథ్యంలో విద్యా రంగంలో తీసుకోవాల్సిన చర్యలపైనే ఈ మీటింగ్లో చర్చించనున్నట్లు ప్రెస్ నోట్లో పేర్కొన్నారు. నియంత్రిత సాగుపై ఇప్పటికే పలుమార్లు రివ్యూ చేసిన సీఎం.. వానాకాలం మొదలైన రెం డు నెలల తర్వాత కొత్తగా చర్చించడానికి ఏమీ లేదని అధికారులే అంటున్నారు. కరోనా తీవ్ర తతోపాటు కీలకమైన విద్యా విభాగం, పరీక్షల నిర్వహణపై విధాన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని చెప్తున్నారు. అదే సమయంలో కీలకమైన ఏపీ ప్రాజెక్టులపై ఎందుకు చర్చించటం లేదనే సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

ఎజెండాలో పోతిరెడ్డిపాడు ముచ్చట్నేలేదు

శ్రీశైలంలో చేరే ప్రతి చుక్క నీటిని మళ్లించుకుపోయేలా.. ఏపీ కొత్త ప్రాజెక్టులు చేపడుతోంది. ఆ ప్రాజెక్టుల టెండర్లు ఈనెల 19తో ముగియనున్నాయి. ఒకసారి టెండర్ ప్రాసెస్ కంప్లీటై ఎల్1గా నిలిచిన వర్క్ ఏజెన్సీతో ఏపీ సర్కారు అగ్రిమెంట్ చేసుకుంటే.. ప్రాజెక్టు పనుల విషయంలో లీగల్ గా ప్రొసీడయ్యేందుకు వర్క్ఏజెన్సీకి చాన్స్ఉంటుంది. ఈ పరిస్థితిని క్రియేట్ అయ్యేలా ఏపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. ప్రాజెక్టుపనులకు అడ్డంకిగా ఉన్నఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ ఈ నెల 11 తర్వాత తొలగిపోయే అవకాశముంది. అంటే ఏపీ లిఫ్ట్పనులకు ఇక కృష్ణా బోర్డు, సీడబ్ల్యూసీ టెక్నికల్ అప్రైజల్, అపెక్స్ కౌన్సిల్ అనుమతి మాత్రమే అవసరం. ఈ పర్మిషన్లు మెల్లగా తెచ్చుకోవచ్చు, ముందు పనులు మొదలు పెట్టాలని ఏపీ సర్కారు ఇంజనీర్లకు క్లారిటీ ఇచ్చినట్టు తెలిసింది. ఏపీ ఇంత పకడ్బందీగా పనులు చేసుకుంటున్నా, అన్నివిషయాలు మన సర్కారుకు తెలిసినా పోతిరెడ్డిపాడు, సంగమేశ్వరం లిఫ్ట్ ముచ్చట కేబినెట్ ఎజెండాలో చేర్చలేదు. దీన్ని బట్టి మన సర్కారుకు ఈ విషయం అంత ప్రయారిటీ కాదన్నట్టు స్పష్టమవుతోందన్న విమర్శలు వస్తున్నాయి.

కరోనా లెక్కలు దాచారు..వారం నుంచి పోర్టల్ లో అప్ లోడ్ బంద్