నిప్పుల కొలిమి..రాష్ట్రవ్యాప్తంగా12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు

నిప్పుల కొలిమి..రాష్ట్రవ్యాప్తంగా12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగానే టెంపరేచర్లు
  • అత్యధికంగా జగిత్యాల జిల్లాలో 45.9 డిగ్రీలు
  • నల్గొండ, నిర్మల్​, సిద్దిపేట జిల్లాల్లో 45.8 డిగ్రీలు నమోదు
  • మరో 10 జిల్లాల్లోనూ 44 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు రికార్డ్​
  • వచ్చే నాలుగు రోజులు 15 జిల్లాలకు రెడ్​ అలర్ట్​

హైదరాబాద్, వెలుగు: భానుడి భగభగతో రాష్ట్రం నిప్పుల కొలిమిలా మండుతున్నది. టెంపరేచర్లు మరోసారి రెడ్​జోన్‌‌లోకి వెళ్లాయి. మంగళవారం 12 జిల్లాల్లో 45 డిగ్రీలకుపైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వడగాడ్పులూ ఆయా జిల్లాల్లో తీవ్రంగా ఉన్నాయి. అత్యధికంగా జగిత్యాల జిల్లా ఐలాపూర్‌‌‌‌లో 45.9 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. నల్గొండ జిల్లా కట్టంగూర్​, నిర్మల్​ జిల్లా దస్తూరాబాద్​, సిద్దిపేట జిల్లా శనిగరంలో 45.8 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు రికార్డయ్యాయి.

మంచిర్యాల జిల్లా వెల్గనూరు, పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో 45.7 డిగ్రీలు, ఆదిలాబాద్​ జిల్లా రాంనగర్​, కామారెడ్డి జిల్లా బోమనదేవిపల్లి, కరీంనగర్​ జిల్లా గంగాధర, నిజామాబాద్​ జిల్లా భీంగల్​, రాజన్న సిరిసిల్ల జిల్లా పెద్దూరులో 45.6 డిగ్రీలు, కుమ్రం భీం జిల్లా సిర్పూరులో 45.5 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మరో 10 జిల్లాల్లో 44 డిగ్రీలకుపైగా రికార్డయ్యాయి. హనుమకొండ జిల్లా పెద్ద పెండ్యాల్​, ఖమ్మం జిల్లా తిమ్మారావుపేట, సూర్యాపేట జిల్లా రఘునాథపాలెంలలో 44.8 డిగ్రీలు, మహబూబాబాద్​ జిల్లా తొర్రూరు, మెదక్​ జిల్లా కాగజ్​మద్దూరు, ములుగు జిల్లా గోవిందరావుపేట, యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరులో 44.5 డిగ్రీల చొప్పున టెంపరేచర్లు నమోదయ్యాయి. వరంగల్​, జనగామ, జయశంకర్​భూపాలపల్లి జిల్లాల్లోనూ 44 డిగ్రీలకుపైగానే రికార్డయ్యాయి. 

హైదరాబాద్​ సిటీలోనూ భగభగ..

హైదరాబాద్​ సిటీలోనూ మంగళవారం ఎండమంట తీవ్రంగానే ఉన్నది. మూడు సర్కిళ్లు మినహా అన్ని సర్కిళ్లలోనూ 42 డిగ్రీలకుపైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అత్యధికంగా కుత్బుల్లాపూర్​లో 42.8 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత రికార్డ్​అయింది. చందానగర్‌‌‌‌లో 42.6, హయత్‌‌నగర్​, సంతోష్​నగర్​, రాజేంద్రనగర్​, మల్కాజిగిరిలో 42.4, బేగంపేట, గాజులరామారం, మూసాపేట, అంబర్‌‌‌‌పేట, ముషీరాబాద్​, సరూర్‌‌‌‌నగర్  సర్కిళ్లలో 42.3 డిగ్రీల మేర టెంపరేచర్లు నమోదయ్యాయి.

కాగా, రాబోయే 4 రోజులపాటు రాష్ట్రంలో వడగాడ్పులు తీవ్రంగా ఉంటాయని ఐఎండీ వెల్లడించింది.  ఉత్తర తెలంగాణ జిల్లాలతోపాటు ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట, నల్గొండ జిల్లాలు సహా మొత్తంగా 15 జిల్లాలకు రెడ్​ అలర్ట్‌‌ను జారీ చేసింది. మిగతా జిల్లాలనూ ఆరెంజ్​ అలర్ట్​లో పెట్టింది. ఈ నాలుగు రోజులు జాగ్రత్తగా ఉండాలని ఐఎండీ అధికారులు సూచిస్తున్నారు.