- మిగిలిన మరో 14 వేల సీట్లు
- ఈనెల 25లోపు సెల్ఫ్ రిపోర్టు చేయాలి: శ్రీదేవసేన
హైదరాబాద్, వెలుగు: టీజీ ఎప్ సెట్ రెండో విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ పూర్తయింది. రాష్ట్రవ్యాప్తంగా ఇంజినీరింగ్ కాలేజీల్లో 84.9 శాతం సీట్లు విద్యార్థులకు అలాట్ అయ్యాయి. ఈ మేరకు గురువారం టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ శ్రీదేవసేన వివరాలు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా 176 ఇంజినీరింగ్ కాలేజీల్లో మొత్తం 94,424 సీట్లు అందుబాటు ఉన్నాయి. వీటిలో రెండో విడత ముగిసే సమయానికి 80,167 సీట్లు నిండాయి.
ఇంకా 14,257 సీట్లు ఖాళీగా ఉన్నాయి. ఎప్ సెట్ రెండో విడతలో మొత్తం 60,792 మంది విద్యార్థులు వెబ్ ఆప్షన్లు ఇవ్వగా, వారిలో 7,897 మందికి కొత్తగా ఈ ఫేజ్లో సీట్లు అలాట్ అయ్యాయి. మరో 37,442 మంది విద్యార్థుల సీట్లలో ఎలాంటి మార్పు జరగలేదు. ఫస్ట్ ఫేజ్లో సీట్లు పొందిన 34,828 మందికి సెకండ్ ఫేజ్ స్లైడింగ్ ద్వారా కాలేజీలు మారాయి. కాగా, సీట్లు అలాటైన విద్యార్థులు ఈనెల25లోపు ఆన్లైన్లో ట్యూషన్ ఫీజు చెల్లించి, వెబ్సైట్ ద్వారా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని శ్రీదేవసేన సూచించారు.
రాష్ట్రంలోని రెండు ప్రైవేట్ వర్సిటీల్లోని 1,386 సీట్లలో 1,384 సీట్లు నిండాయి. 21 గవర్నమెంట్ యూనివర్సిటీ కాలేజీల్లో 6,437 సీట్లకు 4,853 సీట్లు భర్తీ కాగా, 152 ప్రైవేట్ కాలేజీల్లో 86,387 సీట్లుంటే.. 73,874 సీట్లు నిండాయి. ఇక ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) కోటా కింద 6,329 మందికి సీట్లు దక్కాయి.
అయితే, ఫీజు చెల్లించి సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు జులై 24 నుంచి 28వ తేదీలోపు తమకు కేటాయించిన కాలేజీకి వెళ్లి స్వయంగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఒరిజినల్ ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ తోపాటు జిరాక్స్ కాపీల సెట్ అందించాల్సి ఉంటుంది. ఒకవేళ 28వ తేదీలోపు కాలేజీలో రిపోర్ట్ చేయకపోతే ఆ సీటు ఆటోమేటిక్గా రద్దవుతుందని అధికారులు స్పష్టం చేశారు. మిగిలిపోయిన సీట్ల కోసం ఫైనల్ ఫేజ్ కౌన్సెలింగ్ త్వరలోనే నిర్వహించనున్నారు.
