హైదరాబాద్, వెలుగు: పాలిటెక్నిక్ డిప్లొమా, బీఎస్సీ (మ్యాథ్స్) పూర్తి చేసిన విద్యార్థులకు ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో నేరుగా సెకండియర్ (లేటరల్ ఎంట్రీ) ప్రవేశాల కోసం శుక్రవారం నిర్వహించిన టీజీ ఈసెట్ – 2026 ఎంట్రెన్స్ ఎగ్జామ్ ప్రశాంతంగా ముగిసింది. ఉస్మానియా యూనివర్సిటీలో హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్ ప్రొఫెసర్ వి. బాలకిష్టారెడ్డి, ఓయూ వీసీ ప్రొఫెసర్ కుమార్ మోలుగారం, ఈసెట్ కన్వీనర్ ప్రొఫెసర్ పి. చంద్రశేఖర్ ఆన్లైన్ పరీక్షకు సంబంధించిన పాస్వర్డ్ను విడుదల చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 18,626 మంది అభ్యర్థులు ఈసెట్ కు దరఖాస్తు చేసుకోగా, వారిలో 17,870 (95.94%) మంది ఎగ్జామ్ రాశారు. హైదరాబాద్ రీజియన్లోని 36 సెంటర్లలో 12,038 మందికి గానూ 11,467 (95.25%) మంది హాజరుకాగా, తెలంగాణలోని ఇతర జిల్లాల్లో ఉన్న 40 సెంటర్లలో 6,588 మందికి గానూ 6,403 (97.19%) మంది పరీక్ష రాశారు. హైదరాబాద్ కంటే జిల్లాల్లోనే హాజరు శాతం ఎక్కువగా నమోదైంది.
