- బక్రీద్ నేపథ్యంలో మార్పులు చేసిన జేఎన్టీయూహెచ్
హైదరాబాద్, వెలుగు: టీజీ పీజీఈసెట్-2026 షెడ్యూల్లో అధికారులు స్వల్ప మార్పు చేశారు. బక్రీద్ పండుగను దృష్టిలో ఉంచుకుని మే28న జరగాల్సిన పరీక్షను జూన్ ఫస్ట్కు వాయిదా వేసినట్టు కన్వీనర్ డాక్టర్ కె. వెంకటేశ్వరరావు ప్రకటించారు. కేవలం ఆ ఒక్క రోజు పరీక్ష తేదీ మాత్రమే మారిందని, మిగిలిన ఎగ్జామ్స్ షెడ్యూల్ యథాతథంగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మే 29, 30, 31 తేదీల్లో జరగాల్సిన ఈసీ, మెకానికల్, కంప్యూటర్ సైన్స్, సివిల్ వంటి ఇతర సబ్జెక్టుల పరీక్షలు ముందే ప్రకటించిన షెడ్యూల్ ప్రకారమే జరుగుతాయని అధికారులు వెల్లడించారు.
పరీక్షా సెషన్ల టైమింగ్స్లో కూడా ఎలాంటి మార్పులు లేవని, ఉదయం సెషన్ 10 నుంచి 12 వరకు, మధ్యాహ్నం సెషన్ 2 నుంచి 4 గంటల వరకు యథావిధిగా కొనసాగుతాయని తెలిపారు. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు మే 22 ఉదయం 11 గంటల నుంచి పీజీఈసెట్ అధికారిక వెబ్సైట్ www.pgecet.tgche.ac.in ద్వారా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు.
