కేంద్రం ఆఫర్.. కిలో ఉల్లి రూ.26 కే

కేంద్రం ఆఫర్.. కిలో ఉల్లి రూ.26 కే

భారీ వర్షాలకు దేశ వ్యాప్తంగా పంటలు తీవ్రంగ దెబ్బతిన్నాయి. దీంతో నిత్యవసర వస్తువుల ధరలకు రెక్కలొచ్చాయి.ముఖ్యంగా ఉల్లి రేటు అమాంతం పెరిగిపోయింది. ప్రస్తుతం మార్కెట్లో  ఉల్లి కేజీ ధర రూ. 80 నుంచి రూ.100 వరకు ఉంది. దీంతో కేంద్ర ప్రభుత్వం ముందుగా అలర్టయింది. రేట్లను తగ్గించేందుకు కేంద్రం మహారాష్ట్రలో నిల్వ చేసిన బఫర్ స్టాక్ ను  తీసుకోవాలని అన్ని రాష్ట్రాలను, కేంద్ర పాలిత ప్రాంతాలను ఆదేశించింది.

బఫర్ స్టాక్ నుంచి అస్సాం, ఆంధ్రప్రదేశ్, బీహార్, చండీగర్, హర్యానా, తెలంగాణ, తమిళనాడు మొత్తం 8,000 టన్నుల ఉల్లిని తీసుకుంటున్నాయని.. ఇతర రాష్ట్రాల  స్పందన కోసం ఎదురుచూస్తోందని  వినియోడదారుల  వ్యవహారాల కార్యదర్శి లీలా నందన్  అన్నారు. బఫర్ స్టాక్ నుండి కేజీకి-26-28 చొప్పున ఉల్లిని కేంద్రం అందిస్తుంది. ఆయా రాష్ట్రాలు నేరుగా కావాలంటే  కిలోకు రూ. 30  ఇస్తామన్నారు. ఖరీఫ్ సీజన్ లో సుమారు 37 లక్షల టన్నుల ఉల్లి పండించారని, అవి కూడా మార్కెట్ కు వస్తే రేట్లు తగ్గుతాయని చెప్పారు. మరోవైపు రేట్లను కంట్రోల్ చేసేందుకు రిటైల్ , హోల్ సేల్ వ్యాపారులకు స్టాక్ పై లిమిట్ పెట్టింది కేంద్రం. రిటైల్ వ్యాపారులు 2 టన్నులు, హోల్ సేల్ వ్యాపారులు 25 టన్నులకు మించి స్టాక్ పెట్టుకోకూడదని  ఆదేశించింది. డిసెంబర్ 31 వరకు అన్ని దేశ వ్యాప్తంగా ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయని తెలిపింది.