దిగుమతి సుంకం తగ్గింపుతో ఆయిల్ పామ్ రైతులకు దెబ్బ

దిగుమతి సుంకం తగ్గింపుతో ఆయిల్ పామ్ రైతులకు దెబ్బ
  • ముడి వంట నూనెలపై దిగుమతి సుంకం 10 శాతం తగ్గించిన కేంద్రం
  • తగ్గనున్న పామాయిల్ గెలల ధర.. ఆందోళనలో వేలాది మంది రైతులు 
  • కేంద్రం తన నిర్ణయాన్ని రివ్యూ చేసుకోవాలి: మంత్రి తుమ్మల 

హైదరాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వం తాజాగా ముడి వంట నూనెలపై బేసిక్ దిగుమతి సుంకాన్ని10 శాతం తగ్గించడంతో ఆయిల్ పామ్ సాగు చేసే రైతులపై ఎఫెక్ట్ పడనుంది. దేశంలోకి దిగుమతి అయ్యే ముడి వంట నూనెలపై దిగుమతి సుంకం 27.5 శాతం, రిఫైనరీ ఆయిల్ పై అన్ని రకాల సుంకాలు కలిపి 37.5 శాతం కేంద్రం వసూలు చేసేది. ఇప్పటివరకు క్రూడ్ పామ్ ఆయిల్(సీపీఓ), క్రూడ్ సోయా ఆయిల్, క్రూడ్ సన్ ఫ్లవర్ ఆయిల్​పై  ఉన్న 20 శాతం బేసిక్ కస్టమ్స్ డ్యూటీని తగ్గించడంతో మొత్తం దిగుమతి సుంకం 27.5 శాతం నుంచి 16.5 శాతానికి తగ్గినట్లయింది. క్రూడ్​పామ్ ఆయిల్ (సీపీఓ)పై దిగుమతి సుంకాన్ని 10% తగ్గిస్తూ కేంద్రం తీసుకున్న నిర్ణయంతో ఇండోనేసియా, మలేషియా నుంచి పెద్ద ఎత్తున క్రూడ్ పామాయిల్ రానుంది. మన దేశ అవసరాలకు ఈ రెండు దేశాల నుంచే 90 శాతం వరకు క్రూడ్ పామాయిల్ దిగుమతి అవుతుంది.  ఏపీ, ఒడిశా, తమిళనాడు, తెలంగాణలో ఆయిల్ పామ్ పంట సాగవుతోంది. తాజాగా దిగుమతి సుంకం 10 శాతం తగ్గించడంతో ఆయిల్ పామ్ గెలల ధరలు తగ్గనున్నాయి.ముడి వంట నూనెల ధరలు తగ్గనుండటంతో సోయా బీన్, సన్ ఫ్లవర్ నూనెల రిటైల్ ధరలు ఎంత మేరకు తగ్గుతాయనేది తేలనప్పటికీ.. ఆయిల్ పామ్ ధరలు మాత్రం బాగా తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు చెప్తున్నారు. 

రూ. 18 వేలకు పడిపోయిన గెలల ధర..  

రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సబ్సిడీలు ఇస్తూ ప్రోత్సహిస్తుండడంతో రైతులు పెద్ద ఎత్తున ముందుకు వచ్చారు. దీంతో గత నాలుగైదేళ్లుగా రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగు గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం దాదాపు 55 వేల మంది రైతులు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా1.97 లక్షల ఎకరాల్లో ఆయిల్​పామ్ సాగు అవుతోంది. అయితే, ఏడాది క్రితం వరకు 5.5 శాతం ఉన్న దిగుమతి సుంకాన్ని కేంద్ర ప్రభుత్వం 20 శాతానికి పెంచింది. దీంతో ఆయిల్ పామ్ గెలల ధర ఒక్కసారిగా రూ.20,058కు పెరిగింది. ఫలితంగా రైతులు ఆయిల్ పామ్ సాగుకు మరింత ముందుకు వచ్చారు. తాజాగా శుక్రవారం నుంచి కేంద్రం క్రూడ్ ఎడిబుల్ ఆయిల్స్ పై దిగుమతి సుంకం10 శాతం తగ్గించనుండటంతో రైతుల్లో ఆందోళన మొదలైంది. ఇప్పటికే ఆయిల్​పామ్ గెలల ధర టన్నుకు రూ.18 వేలకు పడిపోయింది. మున్ముందు ధర మరింత తగ్గే అవకాశాల ఉన్నాయని చెప్తున్నారు.  

ఆయిల్ పామ్ సాగుపై తీవ్ర ప్రభావం 
  
కేంద్రం దిగుమతి సుంకం తగ్గింపుతో రాష్ట్రంలో ఆయిల్ పాం సాగు ప్రోత్సాహానికి తీవ్ర అడ్డంకిగా మారింది. ఆయిల్ పామ్ రైతులకు ఇబ్బందులు తలెత్తనున్నాయి. ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కేంద్రాన్ని కోరుతున్నా. ఆయిల్ పామ్  గెలల ధర తగ్గడంతో పాటు దీర్ఘకాలికంగా దేశీయ ఆయిల్ పామ్ సాగును ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. 40 శాతం దిగుమతి సుంకం పెంచేలా నిర్ణయాన్ని సమీక్షించాలి. ప్రస్తుతం సాగు సీజన్ ప్రారంభమైంది. రైతులకు తగిన ప్రోత్సాహం కల్పిస్తూ, ఈ పంట సాగు పెంపుపై దృష్టి సారిస్తున్న తరుణంలో కేంద్ర నిర్ణయం రైతుల నమ్మకాన్ని ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉంది. దిగుమతి సుంకం తగ్గింపుతో కొత్తగా ఆయిల్ పామ్ సాగు చేపట్టాలనుకునే రైతులు వెనక్కి తగ్గే అవకాశం ఉంది. స్వదేశీ నూనెల ఉత్పత్తిని ప్రోత్సహించాలన్న ఉద్దేశాలకు కేంద్ర నిర్ణయం విరుద్ధంగా ఉంది.    
- తుమ్మల నాగేశ్వర్ రావు, రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి  


దిగుమతి సుంకం పెంచాలి 

ముడి వంట నూనెలపై దిగుమతి సుంకం 10 శాతం తగ్గింపు ఉత్తర్వులను కేంద్ర ప్రభుత్వం వెంటనే ఉపసంహరించుకోవాలి. దేశీయ వంట నూనెల  పంటల సాగుకు ప్రోత్సాహం అందించాలి. దేశీయ అవసరాలకు అనుగుణంగా పామాయిల్ తోపాటు, సన్ ఫ్లవర్, సోయాబీన్, గ్రౌండ్ నట్ సాగు విస్తీర్ణం పెంచేందుకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలి. రెండున్నర లక్షల ఎకరాల విస్తీర్ణంలో పామాయిల్ సాగు చేస్తున్న రైతులపై ఎగుమతి, దిగుమతి సుంకాలు ప్రభావం చూపుతున్నాయి. 
- బొంతు రాంబాబు, రైతు సంఘం నేత