2 లక్షల మందికి కరోనా టెస్టులు..టెస్టింగ్ కిట్లకు సర్కార్ ఆర్డర్!

2 లక్షల మందికి కరోనా టెస్టులు..టెస్టింగ్ కిట్లకు సర్కార్ ఆర్డర్!

హైదరాబాద్, వెలుగురాష్ట్రంలో కనీసం 2 లక్షల మందికి కరోనా టెస్టులు చేసేందుకు వీలుగా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఇందుకు అవసరమైన కిట్ల కొనుగోలుకు ఇండెంట్ రెడీ  చేసింది. తెలంగాణ స్టేట్‌ మెడికల్‌ సర్వీసెస్, ఇన్‌ఫ్రాస్ర్టక్చర్‌‌ డెవలప్‌మెంట్‌(టీఎస్‌ఎంఎస్‌ఐడీసీ) ద్వారా ఈ కిట్ల కొనుగోలుకు ఆర్డర్ చేసినట్టు తెలిసింది. రాష్ట్రంలో రోజు రోజుకూ కరోనా కేసులు పెరగడంతోపాటు దాదాపు 19 జిల్లాల్లోని జమాత్‌ ప్రతినిధులకు వైరస్ ఉన్నట్టు తేలింది. దీంతో పాజిటివ్ కేసులు నమోదవుతున్న ప్రాంతాల్లో ట్రావెల్ హిస్టరీతో సంబంధం లేకుండా, వైరస్  సింప్టమ్స్ ఉన్నవారికి టెస్టులు చేయించాలని రాష్ట్ర ప్రభుత్వం
భావిస్తోంది.

పెరుగుతున్న అనుమానితులు

కరోనా కేసుల సంఖ్య పెరుగుతున్నకొద్దీ వందల సంఖ్యలో అనుమానితులు దవాఖాన్ల బాటపడుతున్నారు. పాజిటివ్  కేసుల ప్రైమరీ  కాంటాక్ట్స్‌, సెకండరీ కాంటాక్ట్స్‌ వేలల్లో నమోదవుతున్నాయి. ప్రస్తుతం వీళ్లలో సీవియర్ సింప్టమ్స్ ఉన్నవారికే టెస్టులు చేస్తున్నారు. మరోవైపు పాజిటివ్ వ్యక్తుల ద్వారా ఇతరులకు వైరస్  విస్తరిస్తోందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తల్లిదండ్రులకు ఎటువంటి ట్రావెల్ హిస్టరీ లేకుండానే హైదరాబాద్‌లో మూడేండ్ల బాబుకు, షాద్‌నగర్‌‌లో ఓ మహిళకు కరోనా పాజిటివ్ వచ్చింది. ఆ మహిళ చనిపోయిన తర్వాత ఆమెకు కరోనా ఉన్నట్టు తేలింది. టెస్టుల సంఖ్యను పెంచితే, ఇలాంటి కేసులు మరిన్ని బయటపడే అవకాశం ఉందని డాక్టర్లు చెబుతున్నారు. ఇప్పటికే ల్యాబ్​ల సంఖ్యను పెంచిన ప్రభుత్వం, టెస్టుల సంఖ్యను కూడా పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే అనుమానితులందరికీ టెస్టులు చేసేందుకు కిట్లు కొనుగోలు చేసేందుకు సిద్ధమైంది.