న్యూఢిల్లీ: కరోనాపై ఏడాదిగా పోరాడుతున్న కేంద్రం తాజా బడ్జెట్లో హెల్త్ కేర్ సెక్టార్కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. కిందటి ఏడాదితో పోలిస్తే 137 శాతం అధికంగా నిధులు కేటాయించింది. 2020-–21లో రూ. 94,452 కోట్లు ఇవ్వగా ఈసారి రూ.2,23,846 కోట్లను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. నివారణ, చికిత్స, సంపూర్ణ ఆరోగ్య సంరక్షణే లక్ష్యంగా ఈ నిధులు కేటాయించామని ఆమె తెలిపారు. 2021–22 సంవత్సరానికి కొవిడ్ 19 వ్యాక్సినేషన్ కోసం రూ. 35 వేల కోట్లను ప్రకటించారు. అవసరమైతే మరింత అందిస్తామని చెప్పారు. మిషన్ పోషణ్ 2.0, ప్రధానమంత్రి ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన లాంటి పథకాలకు కూడా బడ్జెట్లో నిధులు భారీగా ప్రకటించారు. 4 రీజనల్ నేషనల్ ఇన్స్టిట్యూట్ఆఫ్ వైరాలజీ ల్యాబ్లను ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించారు. అర్బన్ స్వచ్ఛభారత్ మిషన్ 2.0కు రూ. 1.4 లక్షల కోట్లు కేటాయించారు. కేంద్ర ఆరోగ్య శాఖకు రూ. 71,268 కోట్లను ప్రకటించారు.
న్యూట్రిషన్ కోసం రూ. 2,700 కోట్లు
పోషణ్ అభియాన్, సప్లిమెంటరీ న్యూట్రిషన్ ప్రోగ్రామ్లను కలిపి మిషన్ పోషన్ 2.0గా కేంద్రం ప్రటించింది. ఇందుకోసం రూ.2,700 కోట్లు కేటాయించింది. 112 యాస్పిరేషనల్ జిల్లాలపై మరింత దృష్టి పెడతామని, పోషకాహార లోపం లేని భారతే తమ లక్ష్యమని చెప్పింది. పోషణ్ 2.0లో ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్, అంగన్వాడీ సర్వీసెస్, పోషణ్ అభియాన్, స్కీమ్ ఫర్ అడోలసెంట్ గర్ల్స్, నేషనల్ క్రెచ్ స్కీమ్లను కలిపారు.
3 వేలకు పైగా బ్లాక్ హెల్త్ యూనిట్లు
పీఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజన పేరుతో పథకాన్ని ప్రకటించిన కేంద్రం.. ఇందులో భాగంగా ఆరేళ్లలో రూ. 64,180 కోట్లు ఖర్చు చేస్తామని వెల్లడించింది. నేషనల్ హెల్త్ మిషన్కు అడిషనల్గా దీన్ని అమలు చేస్తున్నామని చెప్పింది. పథకంలో భాగంగా ప్రైమరీ, సెకండరీ, టెర్షియరీ హెల్త్ కేర్ రంగాలను పటిష్టం చేస్తామంది. కొత్త వ్యాధులను గుర్తించేందుకు, నియంత్రించేందుకు ప్రస్తుతమున్న ఇన్స్టిట్యూషన్లను బలోపేతం చేస్తామని, కొత్త వాటిని కూడా ఏర్పాటు చేస్తామని చెప్పింది. గ్రామాల్లో 17,788.. పట్టణాల్లోని11,024 హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్లకు సపోర్టు పెంచుతామంది. ప్రతి జిల్లాలో ఇంటిగ్రేటెడ్ పబ్లిక్ హెల్త్ ల్యాబ్, 11 రాష్ట్రాల్లో 3,382 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేస్తామని చెప్పింది.
దేశంలోని పబ్లిక్ ల్యాబ్లను కనెక్ట్ చేసే పోర్టల్
602 జిల్లాల్లో క్రిటికల్ కేర్ హాస్పిటల్ బ్లాక్లు, 12 సెంట్రల్ ఇన్స్టిట్యూషన్లను ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజనలో భాగంగా ఏర్పాటు చేయనున్నట్టు కేంద్రం ప్రకటించింది. అలాగే నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ను, దీనికి సంబంధించిన 5 రీజనల్ బ్రాంచీలు, 20 మెట్రోపాలిటన్ హెల్త్ సర్వెయిలెన్స్ యూనిట్లను బలోపేతం చేస్తామని చెప్పింది. 32 ఎయిర్పోర్టులు, 11 సీ పోర్టులు, 7 ల్యాండ్ క్రాసింగ్ పాయింట్లలో చెకప్ల కోసం కొత్తగా 17 పబ్లిక్ హెల్త్ యూనిట్లను ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించింది. అలాగే 9 బీఎస్ఎల్-3 స్థాయి ల్యాబ్లు, రెండు మొబైల్ హాస్పిటళ్లు, నేషనల్ మిషన్ ఫర్ వన్ హెల్త్, డబ్ల్యూహెచ్వో సౌత్ ఈస్ట్ రీజియన్కు రీజనల్ రీసెర్చ్ ప్లాట్ఫామ్ను ఏర్పాటు చేస్తామంది.
ఆయుష్ శాఖకు రూ.2,970 కోట్లు
కొవిడ్ను ఎదుర్కోవడానికి, సంస్కరణల వేగం పెంచడానికి ఆత్మనిర్భర్ ప్యాకేజీలో భాగంగా 27.1 లక్షల కోట్లకు పైగా నిధులను ఖర్చు చేస్తున్నామని కేంద్రం చెప్పింది. డిపార్ట్మెంట్ ఆఫ్ హెల్త్ అండ్ రీసెర్చ్ కోసం రూ.2,663 కోట్లు, ఆయుష్ శాఖకు రూ.2,970 కోట్లు ప్రకటించింది. పోయిన ఏడాది ఆయుష్ శాఖకు రూ. 2,122 కోట్లు కేటాయించింది. సిటీలకూ ట్యాప్ వాటర్
జల్ జీవన్ మిషన్ అర్బన్ పథకంలో భాగంగా పట్టణాల్లోని 2.86 కోట్ల కుటుంబాలకు ట్యాప్ వాటర్ ఇవ్వడమే లక్ష్యంగా స్కీమ్ను స్టార్ట్ చేశారు. 4,378 అర్బన్ లోకల్ బాడీస్లో జల్ జీవన్ మిషన్ అమలు చేసేందుకు ఐదేళ్లకు రూ. 2.87 లక్షల కోట్లను ఖర్చు చేస్తామంది.
ముఖ్యమైన అంశాలివే
- దేశవ్యాప్తంగా 15 హెల్త్ ఎమర్జెన్సీ సెంటర్ల ఏర్పాటు
- ప్రతి జిల్లాకో ఇంటిగ్రేటెడ్ హెల్త్ ల్యాబ్
- మిషన్ పోషణ్ 2.0 ప్రకటన..రూ. 2,700 కోట్ల నిధులు
- పీఎం ఆత్మనిర్భర్ స్వాస్థ్య భారత్ యోజనకు రూ. 64,180 కోట్లు
- పట్టణాలకు జల్ జీవన్ మిషన్ ప్రారంభం
- సిటీల్లో ఎయిర్ పొల్యూషన్ తగ్గించేందుకు రూ. 2,127 కోట్లు