
పని ఇప్పిస్తానని చెప్పి ఓ మైనర్ బాలికను తీసుకెళ్లిన ఓ దుర్మార్గుడు ఆమెపై తరచూ అత్యాచారం చేశాడు. ఇంట్లో నుంచి వెళ్లిన బాలిక 13 నెలలకు ఎలాగోలా ఇంటికి చేరగా.. ప్రస్తుతం ఆమె 5 నెలల గర్భవతి అని తేలింది. ఈ దారుణ సంఘటన ఉత్తరప్రదేశ్ లో జరిగింది. నేపాల్కు చెందిన ఉప్రేత కుమార్ స్థానికంగా ఓ స్కూల్ సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో పదిహేనేళ్ల బాలిక కుటుంబంతో పరిచయం పెంచుకుని, పని ఇప్పిస్తానని చెప్పి ఏడాది క్రితం ఆమెను తనతో తీసుకువెళ్లాడు. ఇక అప్పటి నుంచి బాధితురాలిపై పలుమార్లు లైంగిక దాడికి పాల్పడిన ఆ మృగాడు.. ఇటీవలే బాలికను ఇతర వ్యక్తులకు అమ్మేశాడు.
ఈ క్రమంలో.. వారు బాధితురాలిని వ్యభిచార గృహానికి తీసుకువెళ్లి చిత్రహింసలకు గురిచేశారు. భోజనం కూడా పెట్టకుండా ఉపవాసం ఉంచారు. దీంతో బాధను తట్టుకోలేక, ఎట్టకేలకు ఆ దుర్గార్ముల బారి నుంచి తప్పించుకున్న ఆ బాలిక ఇంటికి చేరుకుంది. ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేయగా విచారణ చేపట్టి.. ఉప్రేత కుమార్ సహా మరో ముగ్గురు నిందితులు జితూ కశ్యప్, వరుణ్ తివారి, అజయ్ కుమార్ను అరెస్టు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. కాగా బాలిక అనారోగ్యం పాలుకావడంతో హాస్పిటల్ కి తరలించగా.. ఆమె ప్రస్తుతం ఐదు నెలల గర్భవతి అని తేలినట్లు చెప్పారు పోలీసులు.