జీ20 సమావేశాల భద్రతపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష

జీ20 సమావేశాల భద్రతపై డీజీపీ ఉన్నత స్థాయి సమీక్ష

గ్రేటర్​ హైదరాబాద్​ లో  నెల 28 నుంచి జూన్‌ 17 మధ్య అత్యంత ప్రతిష్టాత్మక జీ-20 వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో భద్రతపై డీజీపీ అంజనీ కుమార్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. హైదరాబాద్ లో ఈనెల28 నుండి జూన్ 17వ తేదీ మధ్యలో చేపట్టే G20 వర్కింగ్ గ్రూప్ సమావేశాలను విజయవంతంగా నిర్వహించేందుకు సమన్వయంతో పని చేయాలని G20 సెక్యూరిటీ కో ఆర్డినేషన్ కమిటీలో నిర్ణయించారు. డీజీపీ అంజనీ కుమార్ అధ్యక్షతన G20సెక్యూరిటీ సమన్వయ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి రాష్ట్ర సీనియర్ పోలీస్ అధికారులు, ఎయిర్ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, రీజినల్ పాస్ పోర్టు ఆఫీస్, NDRF, DRF, SDRF,CISF,NSG భద్రతా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు హాజరయ్యారు. 

ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో G20 దేశాల అధినేతల అత్యున్నత సమావేశం జరుగనుందని డీజీపీ అంజనీ కుమార్ తెలిపారు. ముందస్తుగా దేశంలోని 56 నగరాల్లో 215 వర్కింగ్ గ్రూపు సమావేశాలు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. దీనిలో భాగంగా హైదరాబాద్  లో ఆరు సమావేశాలు నిర్వహిస్తారని తెలిపారు. ఈనెల28న తొలి సమావేశం జరుగుతుందని చెప్పారు. మార్చిలో 6 , 7, ఏప్రిల్ లో 26 , 27, 28, జూన్ లో 7,8,9, జూన్ లో 15 , 16 ,17 తేదీల్లో వివిధ మంత్రిత్వ శాఖల ఆధ్వర్యంలో వర్కింగ్ గ్రూప్ సమావేశాలు జరుగుతాయని తెలిపారు. ఈ సమావేశాలకు మంత్రులు, కార్యదర్శులు, జాయింట్ సెక్రెటరీ స్థాయి అధికారుల నుండి స్వచ్చంధ సంస్థల ప్రతినిధులు హాజరవుతారని చెప్పారు. సమావేశాలు సజావుగా నిర్వహించేందుకు వివిధ భద్రతా విభాగాల మధ్య సమన్వయం తప్పనిసరి అని చెప్పారు.

సమావేశాలకు హాజరయ్యే ఉన్నతస్థాయి ప్రతినిధులు నగరంలోని పలు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను కూడా సందర్శించే అవకాశమున్నందున.. ఆయా ప్రాంతాల్లో గట్టి భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. శంషాబాద్ ఎయిర్​ పోర్టు, వీఐపీలు బస చేసే హోటళ్లు, సమావేశాలు జరిగే ప్రాంతాల్లో భారీ బందోబస్తు ఏర్పాటు చేయాలని హైదరాబాద్, సైబరాబాద్ పోలీస్ కమిషనర్లను డీజీపీ అంజనీ కుమార్ ఆదేశించారు. ఎయిర్​ పోర్టుతో పాటు నగరంలోనూ ప్రత్యేకంగా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కోరారు.