న్యూఢిల్లీ: ఈ నెల ప్రారంభంలో 18,888 వద్ద ఆల్టైమ్ హై ని నమోదు చేసిన నిఫ్టీ, ఈ లెవెల్ నుంచి శుక్రవారం నాటికి 1,088 పాయింట్లు తగ్గింది. ఫెడ్ మీటింగ్ తర్వాత నుంచి మార్కెట్ల పతనం కొనసాగిందని చెప్పాలి. వడ్డీ రేట్లను మరింతగా పెంచుతామనే సంకేతాలను ఫెడ్ ఇవ్వడంతో యూఎస్ ఎకానమీ రెసిషన్లోకి జారుకుంటుందనే భయాలు ఎక్కువయ్యాయి. దీంతో గ్లోబల్ మార్కెట్లతో పాటు మన మార్కెట్లు కూడా పడ్డాయి. తాజాగా కరోనా కేసులు పెరగడం మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీసింది.
ఇండెక్స్లు కన్సాలిడేట్ అవ్వడానికి చాన్స్ దొరకలేదు. సీనియర్ ఎనలిస్ట్ ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్ సంజీవ్ భాసిన్ మాత్రం త్వరలో మార్కెట్ రివర్స్ అవుతుందని అంచనా వేశారు. రానున్న సోమవారం లేదా మంగళవారం సెషన్లో మార్కెట్ తిరిగి లేస్తుందని అన్నారు. ఇందుకు గల కారణాలను వివరించారు. క్రూడాయిల్ ధరలు దిగొచ్చాయని, యూఎస్ డాలర్ వాల్యూ తగ్గిందని..ఈ రెండు అంశాలు దేశ స్టాక్ మార్కెట్కు సపోర్ట్గా నిలుస్తాయని అభిప్రాయపడ్డారు. మార్కెట్ త్వరలో రీబౌండ్ కావొచ్చు కాబట్టి ఇన్వెస్టర్లు కొత్త పొజిషన్లు తీసుకోవచ్చని సలహా ఇచ్చారు.
‘మార్కెట్ వర్గాలు అంచనావేసిన దాని కంటే ఎక్కువగా నిఫ్టీ, బ్యాంక్ నిఫ్టీ ఇండెక్స్లు పడ్డాయి. బెంచ్మార్క్ ఇండెక్స్లు ఓవర్ సోల్డ్ జోన్లో ఉన్నాయి. ప్రస్తుత లెవెల్స్ నుంచి మార్కెట్ కిందకి పడడం లిమిటెడ్గా ఉంటుంది. వచ్చే వారం బుల్స్ మార్కెట్ను కంట్రోల్లోకి తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తాయి’ అని సంజీవ్ భాసిన్ అన్నారు. కిందటి వారం క్రూడాయిల్ ధరలు, యూఎస్ డాలర్ వాల్యూ తగ్గాయని, వీటి ధరలను పెంచే ఈవెంట్స్ ఏవీ లేవని గుర్తు చేశారు. ఎగుమతులపై ఆధారపడే కంపెనీల షేర్లు తాజా మార్కెట్ కరెక్షన్లో ఎక్కువగా పడ్డాయని, ట్రెండ్ రివర్సల్ టైమ్లో ఇవే ఎక్కువగా లాభపడతాయని వివరించారు.
స్మాల్ క్యాప్ ఫండమెంటల్స్ మారలే..
తాజాగా స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ షేర్లు పడడం రొటీన్గా జరిగేదేనని, ఈసారి ఎక్కువగా పడినా భయపడాల్సిన అవసరం లేదని మరో సీనియర్ ఇన్వెస్టర్ శంకర్ శర్మ పేర్కొన్నారు. ఫండమెంటల్గా ఏం మారలేదని వివరించారు. ట్విటర్లో తన ఎనాలసిస్ను ఆయన పంచుకున్నారు. తన ఎనాలసిస్ షేర్లకని, ఇండెక్స్కు కాదని పేర్కొన్నారు.