హైదరాబాద్: నూతన రెవెన్యూ చట్టం బిల్లును తెలంగాణ ప్రభుత్వం సోమవారం శాసనమండలిలో ప్రవేశపెట్టింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్ సభ్యుల ప్రశ్నలకు, సందేహాలకు బదులిచ్చారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పై విమర్శలు చేశారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ‘భూ భారతి’ అనే కార్యక్రమం ప్రవేశపెట్టిందని, అది ఓ జోక్ అయిందని ఎద్దేవా చేశారు.
చాన్నాళ్ల కిందట ఆ కార్యక్రమం తీసుకువచ్చినా, ఎక్కడా విజయవంతం కాలేదు సరికదా, అక్కడి నుంచి అరాచకాలు ఎక్కువైపోయాయని అన్నారు. నిజామాబాద్ లో అమలు చేసినా విఫలమైందని వివరించారు. భూ సమస్యల విషయంలో జీవన్ రెడ్డి చెప్పింది వట్టిదేనని కొట్టిపారేశారు. ఇప్పుడు తాము ఎవరూ చేయని సాహసం చేస్తున్నామని, సమగ్ర భూ సర్వేలతో సమస్యలన్నీ పరిష్కారం అవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.
