మున్సిపోల్స్లో దగ్గరోళ్లకు చాన్స్ దక్కేలా నేతల ప్రయత్నాలు
ప్రత్యర్థి వర్గానికి అవకాశం దక్కకుండా వ్యూహాలు
ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులూ ఇదే దారిలో..
బంధువులకు టికెట్లు ఇప్పించుకునేందుకు ఒత్తిళ్లు
హైదరాబాద్, వెలుగు: మున్సిపోల్స్ లో దగ్గరివాళ్లకు చాన్స్ దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్టు తెలిసింది. సొంతవాళ్లు, బంధువులు, సన్నిహిత అనుచరులకు టికెట్లు ఇవ్వాలని.. తమకు అనుకూలంగా రిజర్వేషన్ కోటా వచ్చేలా చూడాలని పార్టీ పెద్దలను కోరుతున్నట్టు ప్రచారం జరుగుతోంది. భవిష్యత్తులో రాజకీయంగా ఎదిగేందుకు మున్సిపోల్స్ తొలి మెట్టు అని.. ఇప్పుడు మున్సిపల్ చైర్మనో, మేయర్ పదవో దక్కితే రానున్న రోజుల్లో ఎమ్మెల్యే టికెట్ అడగొచ్చని భావిస్తున్నట్టు సమాచారం. ఇదే సమయంలో తమ ప్రత్యర్థి వర్గాలకు అనుకూలంగా రిజర్వేషన్ రాకుండా చూడాలని ఒత్తిడి తెస్తున్నట్టు తెలుస్తోంది.
రాష్ట్రవ్యాప్తంగా 120 మున్సిపాల్టీలు, 10 కార్పొరేషన్లకు ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో అధికార పార్టీలో సందడి నెలకొంది. మున్సిపల్ అధికారులు జనవరి 6న రిజర్వేషన్లను ఫైనల్ చేసే అవకాశముంది. మున్సిపల్ చైర్మన్, మేయర్ పదవుల కోసం రాష్ట్రం యూనిట్గా రిజర్వేషన్లను ఖరారు చేస్తారు. మున్సిపల్ ఏరియాల్లో ఉన్న బీసీ, ఎస్సీ, ఎస్టీ జనాభా ప్రతిపాదికన 50 శాతం సీట్లను ఆయా వర్గాలకు కేటాయిస్తారు. దీంతో తమకు అనుకూలంగా రిజర్వేషన్లు దక్కించుకునేందుకు అధికార పార్టీ నేతలు రంగంలోకి దిగినట్టు తెలిసింది.
కరీంనగర్లో ప్రత్యర్థులకు చెక్ పెట్టేందుకు..
ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో మంత్రులు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు దక్కించుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. గత మున్సిపల్ ఎలక్షన్లలో ఏరికోరి తెచ్చుకున్న మేయర్.. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు వ్యతిరేకంగా పనిచేశారన్న అనుమానం మంత్రి అనుచరులకు ఉంది. ఈసారి తప్పకుండా తమకు అనుకూలమైన వ్యక్తిని, అందులోనూ తన సామాజిక వర్గానికి చెందిన నేతను మేయర్ చేయాలని ఆ మంత్రి ప్రయత్నిస్తున్నట్టు ప్రచారంలో ఉంది. అనుకూలంగా రిజర్వేషన్ ఉండేలా చూడాలని హైకమాండ్ను కోరినట్టు తెలిసింది. ఇక ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఓ మంత్రి, ఓ రాజ్యసభ ఎంపీ మధ్య చాలా కాలంగా ఆధిపత్య పోరు ఉంది. ఆ ఎంపీ కూడా తమ వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్లు వచ్చేలా ప్రయత్నిస్తున్నట్టు చెప్తున్నారు.
ఆదిలాబాద్లో తనయుడి కోసం..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఓ మంత్రి తన రాజకీయ వారసుడిగా కొడుకును రంగంలోకి దింపేందుకు చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల సమయంలోనే టికెట్ కోసం ప్రయత్నించారు. పార్టీ పెద్దలు నో చెప్పడంతో స్వయంగా పోటీకి దిగారు. మున్సిపల్ ఎన్నికల్లోనైనా కుమారుడికి రాజకీయ అరంగేట్రం చేయించేందుకు ఆ మంత్రి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నారని ప్రచారంలో ఉంది. మున్సిపల్ చైర్మన్ సీటులో తన కుమారుడు కూర్చునేలా రిజర్వేషన్ ఇప్పించాలని హైకమాండ్ను కోరినట్టు తెలిసింది. ఇక ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకే చెందిన ఓ ఎమ్మెల్యే.. తన వ్యతిరేక వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్లు వస్తాయన్న అంచనాలతో హైదరాబాద్ కు వచ్చి రెండు మూడు రోజులు మకాం వేశారని.. పార్టీ పెద్దలను కలిసి తన పోటీదారులకు అనుకూలంగా రిజర్వేషన్లు రాకుండా చూడాలని కోరినట్టు తెలిసింది.
స్నేహితుడి కోసం ఓ మంత్రి
మహబూబ్ నగర్ జిల్లాలో ఓ మున్సిపల్ చైర్మన్ పదవిని తన స్నేహితుడికి కట్టబెట్టేందుకు ఓ మంత్రి తీవ్రంగా కష్టపడుతున్నారని తెలిసింది. 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో తనకు అండగా నిలిచిన ఆ స్నేహితుడిని ఈసారి ఎలాగైనా మున్సిపల్ చైర్మన్ కుర్చీపై కూర్చోబెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలిసింది. వాస్తవానికి తొలుత తన సోదరుడిని మున్సిపల్ చైర్మన్ చేయాలనుకున్నారని, ఆయనపై స్థానికంగా వ్యతిరేకత ఉండటంతో మౌనంగా ఉండిపోయారన్న ప్రచారం ఉంది.
ఉమ్మడి వరంగల్ లో మంత్రులు వర్సెస్ ఎమ్మెల్యేలు
ఉమ్మడి వరంగల్ జిల్లాలో మంత్రులు, ఎమ్మెల్యేల వర్గాల మధ్య మున్సిపోల్ వార్ జరుగుతోందని టీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. ఎమ్మెల్యే వర్గానికి టికెట్ దక్కకుండా, తమవారికి వచ్చేలా మంత్రులు ప్రయత్నిస్తున్నారని అంటున్నాయి. ఓ మున్సిపాలిటీలో ఎమ్మెల్యే తన భార్యను బరిలోకి దించేందుకు ప్లాన్ రెడీ చేసుకున్నారని, అందుకు అనుకూలంగా రిజర్వేషన్ ఇప్పించాలంటూ ఒత్తిడి తెస్తున్నారని తెలిసింది. ఓ మంత్రి సదరు ఎమ్మెల్యే ప్రయత్నాలకు చెక్ పెడుతున్నారని సమాచారం.
కొడుకుల కోసం ఎమ్మెల్యేల కష్టాలు
ఉమ్మడి నల్గొండ జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు తమ కుమారులను మున్సిపల్ చైర్మన్లుగా చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాగార్జున సాగర్ లో తన కుమారుడిని చైర్మన్ గా చూసేందుకు స్థానిక ఎమ్మెల్యే ప్రయత్నిస్తున్నారని తెలిసింది. అలాగే మిర్యాలగూడ మున్సిపాలిటీలోనూ తన కుమారుడికి చైర్మన్ చాన్స్ వచ్చేలా అనుకూల రిజర్వేషన్ కోసం మరో ఎమ్మెల్యే ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.
కీలక పదవుల్లో ఉన్న వారు కూడా..
రాజ్యాంగ పదవుల్లో ఉన్న ఇద్దరు నేతలు కూడా తమ బంధువులను మున్సిపోల్స్ లో పోటీ చేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అనుకూలంగా రిజర్వేషన్లు ఉండాలని కోరుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి నిజామాబాద్, నల్గొండ జిల్లాలో ఉండే రెండు మున్సిపాల్టీల్లో తము ఆశించినట్టుగా రిజర్వేషన్లు ఉండాలని కోరుతున్నట్టు ప్రచారం ఉంది.
కోరినట్టు రావడం కష్టమే..
మంత్రులు, ఎమ్మెల్యేలు తమకు అనుకూలంగా రిజర్వేషన్లు కావాలంటూ క్యూ కడుతుండటంపై హైకమాండ్ పెద్దలు అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలిసింది. కోరినట్టు రిజర్వేషన్లు ఇప్పించడం కుదరదని చెప్తున్నట్టు సమాచారం. రిజర్వేషన్లు ఏ వర్గానికి వస్తే వారిని గెలిపించాల్సిన బాధ్యత స్థానిక మంత్రులు, ఎమ్మెల్యేలదేనని సంకేతాలు ఇచ్చినట్టు తెలిసింది.
మాకు రాకుంటే.. ప్రత్యర్థికీ రావొద్దు!
హైకమాండ్ వద్దకు వెళ్తున్న టీఆర్ఎస్ నేతలు రెండు రకాల ప్రతిపాదనలు తీసుకెళ్తున్నారని ప్రచారం పార్టీ వర్గాల్లో ఉంది. తమకు అనుకూలంగా రిజర్వేషన్ వచ్చేలా చూడాలన్నది మొదటి ఆప్షన్ కాగా.. ఒకవేళ అలా సాధ్యం కాకపోతే ప్రత్యర్థికి వర్గానికి అనుకూలంగా రిజర్వేషన్ రాకుండా చూడాలన్నది రెండో ఆప్షన్ అని చెప్తున్నట్టు సమాచారం. తమకు అనుకూలంగా రిజర్వేషన్ రాకపోతే ఎన్నికల్లో సహకరించలేమన్న సంకేతాలను కూడా ఇస్తున్నట్టు తెలిసింది.
సిటీ శివార్లపై మంత్రుల నజర్
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న 10 మున్సిపల్ కార్పొరేషన్లలో ఏడు కార్పొరేషన్లు హైదరాబాద్ శివార్లలోనే ఉన్నాయి. ఇవన్నీ కొత్తగా ఏర్పాటైనవే. వీటిల్లో మేయర్ రిజర్వేషన్లను అన్ని కోణాల్లో చూసుకుని తీసేలా ప్రయత్నాలు జరుగుతున్నట్టు రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. ఈ ఏడు మున్సిపల్ కార్పొరేషన్లు ఇద్దరు మంత్రుల నియోజకవర్గాల పరిధిలో ఉన్నాయి. వారు కూడా తమ పోటీదారులకు అనుకూలంగా రిజర్వేషన్లు రాకుండా జాగ్రత్త పడుతున్నట్టు తెలిసింది. మేయర్ పదవి అడిగే వాళ్లలో చాలా మంది భవిష్యత్తులో అసెంబ్లీ టికెట్ ఆశిస్తున్నవారే. దాంతో తాము చెప్పినట్టు వినే వారికి మేయర్ చాన్స్ వచ్చేలా రిజర్వేషన్ల కోసం ప్రయత్నిస్తున్నట్టు సమాచారం.