రేపు హుజూరాబాద్ లో రెండో విడత గొర్రెల పంపిణీ

రేపు హుజూరాబాద్ లో రెండో విడత గొర్రెల పంపిణీ
  • తొలిసారి హుజూరాబాద్ వెళ్లనున్న మంత్రి హరీష్ రావు 
  • హాజరవుతున్న మంత్రులు తలసాని, గంగుల, కొప్పుల, ఎర్రబెల్లి

హుజూరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ విడత గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి, సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ హుజూరాబాద్ నియోజకవర్గంలో ప్రారంభించనున్నారు. ఈ నెల 28 వ తేదీన అంటే రేపు బుధవారం ఉదయం 11.00 గంటలకు కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ నియోజకవర్గ పరిధిలోని జమ్మికుంట మార్కెట్ యార్డ్ లో ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో మంత్రులు హరీష్ రావు, గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్, ఎర్రబెల్లి దయాకర్ రావు లు పాల్గొననున్నారు. 
2వ విడతలో రాష్ట్రంలోని 3.81 లక్షల మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికోసం ఇటీవల ముఖ్యమంత్రి కేసీఆర్ 6 వేల కోట్ల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. అంతేకాకుండా పెరిగిన ధరలు, లబ్దిదారుల నుండి వచ్చిన విజ్ఞప్తుల మేరకు గొర్రెల యూనిట్ ధర గతంలో 1.25 లక్షల రూపాయలు ఉండగా, దానిని 1.75 లక్షల రూపాయలకు పెంచేందుకు కూడా ముఖ్యమంత్రి ఆమోదం తెలిపారు. రాష్ట్రంలోని 8109 సొసైటీ లలో సభ్యులుగా ఉన్న 7,61, 898 మంది గొల్ల, కురుమలకు గొర్రెల యూనిట్ లను పంపిణీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కాగా మొదటి విడత లో 5 వేల కోట్ల రూపాయలను కేటాయించగా 4702.78 కోట్ల రూపాయల ఖర్చుతో 3,76, 223 యూనిట్ల గొర్రెలను లబ్దిదారులకు పంపిణీ చేయడం జరిగింది.