- నిప్పు అంటుకుని పరుగెడుతున్నా బండరాయితో బాది హత్య
- రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో ఘటన
- పరారీలో నిందితుడు.. స్పెషల్ టీంతో గాలిస్తున్న పోలీసులు
ఎల్బీ నగర్, వెలుగు: డ్రగ్స్ మానేయాలని మందలించిన కన్నతండ్రినే చంపేశాడు కొడుకు. తండ్రిపై పెట్రోల్ పోసి నిప్పంటించి బండరాయితో బాది హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా తుర్కయాంజాల్లో జరిగింది. తుర్కయాంజాల్లోని ఆరెంజ్ అవెన్యూలో నివాసం ఉంటున్న తిరుపతి అనురాగ్ (27) ఆవారాగా తిరుగుతున్నాడు. మద్యం, గంజాయి, డ్రగ్స్కు బానిసగా మారాడు. తన విలాసాల కోసం ఇంట్లో డబ్బులు తీసుకుంటున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు అతడిని డీఅడిక్షన్ సెంటర్లో చేర్పించారు.
అక్కడికి వెళ్లి వచ్చినా అతని తీరు మారలేదు. రోజూ అదేపనిగా మత్తు పదార్థాలు తీసుకుంటుండడంతో తండ్రి రవీందర్.. ‘‘మత్తు పదార్థాలు తీసుకుంటూ నీ జీవితం నాశనం చేసుకోకు’’ అని కొడుకుకు నచ్చజెప్పే ప్రయత్నం చేశాడు. అయినా కూడా అనురాగ్ వినలేదు. రోజూ మత్తులో ఇంటికి వచ్చి తండ్రితో గొడవకు దిగేవాడు. గురువారం మధ్యాహ్నం కూడా ఇదే విషయంలో తండ్రితో గొడవ పడ్డాడు. ఈ క్రమంలో తండ్రి రవీందర్ పై దాడి చేసి పెట్రోలు పోసి నిప్పంటించాడు. అంతటితో ఆగకుండా నిప్పు అంటుకొని పరిగెడుతున్న తండ్రిపై బండరాయితో బాది దారుణంగా హత్య చేశాడు. అనంతరం అక్కడి నుంచి పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. రవీందర్ భార్య సుధ ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలిస్తున్నారు.