కొత్త సెక్రటేరియెట్​కు 300 మంది పోలీసులతో..సెక్యూరిటీ

కొత్త సెక్రటేరియెట్​కు 300 మంది పోలీసులతో..సెక్యూరిటీ
  • ప్రతి ఫ్లోర్​కు కాపలా.. కంప్లీట్ ఇంటెలిజెన్స్ వాచ్ 
  • టీఎస్ఎస్​పీకి కాకుండా బెటాలియన్​కు బాధ్యతలు

హైదరాబాద్​, వెలుగు: కొత్త సెక్రటేరియెట్​కు రాష్ట్ర సర్కార్​ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నది. ప్రతి ఫ్లోర్​లో పోలీసు పహారా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దాదాపు 300ల మంది పోలీస్​ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బెటాలియన్ పోలీస్​ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించనున్నది.  ఈ మేరకు ఇంటెలిజెన్స్​ డిపార్ట్​మెంట్​నుంచి డీజీపీ ఆఫీస్​కు గత నెల 12వ తేదీన సమాచారం అందింది. ఈ నెల 18న సెక్రటేరియెట్​ను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓపెనింగ్​ తర్వాత అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉండడంతో డీజీపీ ఆఫీస్​ నుంచి టీఎస్​ఎస్​పీ బెటాలియన్​ ఏడీజీకి లెటర్​ వెళ్లింది. ఒకటి, మూడు, 8 బెటాలియన్ల నుంచి ఆరుగురు ఆర్​ఐలు, 14 మంది ఆర్​ఎస్​ఐలు, 50 మంది ఏఆర్​ఎస్​ఐ/హెడ్​కానిస్టేబుల్​, పీసీలు 217 మంది, ఎల్​జీఎస్​ 10 మందిని  కేటాయిస్తూ బెటాలియన్ కమాండెంట్స్​కు సమాచారం వెళ్లింది. 

బెటాలియన్​కు సెక్యూరిటీ బాధ్యతలు

దాదాపు 25 ఏండ్లుగా సెక్రటేరియెట్​కు తెలంగాణ స్టేట్​స్పెషల్​ ప్రొటెక్షన్​ ఫోర్స్​పోలీసులు భద్రతనిస్తున్నారు. ఇప్పుడు కూడా  వారి ఆధ్వర్యంలోనే సెక్యూరిటీ కొనసాగుతోంది.  ప్రస్తుతం దాదాపు 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్​పీఎఫ్​ నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు. అయితే, ఎస్​పీఎఫ్​ను కాదని బెటాలియన్​కు కొత్త సెక్రటేరియెట్​లో భద్రత బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్​ లేకుండానే నేరుగా డీజీపీ ఆఫీస్​ నుంచి బెటాలియన్​కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంట్లోనూ ఏదో మిస్​ కమ్యూనికేషన్​ జరిగిందని కొందరు అధికారులు చెబుతున్నారు. 

ఇంటెలిజెన్స్​ నిఘా

సెక్రటేరియెట్​లోకి ఎవరు వస్తున్నారు ? ఎవరు వెళ్తున్నారు ? ఏ ఉన్నతాధికారి ఎంతసేపు ఉంటున్నారు ? ఎవరెవరిని ఎవరు కలుస్తున్నారే సమగ్ర వివరాలతో ఇంటెలిజెన్స్​ రెగ్యులర్​ వాచ్​ చేయనున్నది. ప్రతి ఒక్కరి కదలికను చూడటంతో పాటు సెక్రటేరియెట్​పై డెయిలీ ఇంటెలిజెన్స్​ రిపోర్ట్​ ఇవ్వనున్నట్లు తెలిసింది.  ఇప్పుడు సీఎం, సీఎంవో మొత్తం ప్రగతి భవన్​ నుంచి పనిచేస్తోంది. అయితే, సెక్రటేరియెట్ ఓపెన్​ తర్వాత అంతా ఇక్కడి​ నుంచే పనిచేయనున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందికి రెట్టింపు సంఖ్యలో పెట్టాలని నిర్ణయించారు. కాగా, ఇంటెలిజెన్స్​ లెటర్​ను బట్టి ఈ నెల 18న కొత్త సెక్రటేరియెట్​ను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. పనులు కంప్లీట్​కాలేదు. దీంతో ఒక్క ఫ్లోర్​ మాత్రమే ఒపెన్​ చేస్తారనే చర్చ జరుగుతోంది.  ఓపెనింగ్​ ఇంకొన్ని రోజులు పోస్ట్​పోన్​ అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు.