- ప్రతి ఫ్లోర్కు కాపలా.. కంప్లీట్ ఇంటెలిజెన్స్ వాచ్
- టీఎస్ఎస్పీకి కాకుండా బెటాలియన్కు బాధ్యతలు
హైదరాబాద్, వెలుగు: కొత్త సెక్రటేరియెట్కు రాష్ట్ర సర్కార్ కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేయనున్నది. ప్రతి ఫ్లోర్లో పోలీసు పహారా ఉండేలా చర్యలు తీసుకుంటోంది. ఇందుకోసం దాదాపు 300ల మంది పోలీస్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా బెటాలియన్ పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ కూడా ఇప్పించనున్నది. ఈ మేరకు ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్నుంచి డీజీపీ ఆఫీస్కు గత నెల 12వ తేదీన సమాచారం అందింది. ఈ నెల 18న సెక్రటేరియెట్ను ప్రారంభించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఓపెనింగ్ తర్వాత అవసరమైన భద్రతా చర్యలు చేపట్టాల్సి ఉండడంతో డీజీపీ ఆఫీస్ నుంచి టీఎస్ఎస్పీ బెటాలియన్ ఏడీజీకి లెటర్ వెళ్లింది. ఒకటి, మూడు, 8 బెటాలియన్ల నుంచి ఆరుగురు ఆర్ఐలు, 14 మంది ఆర్ఎస్ఐలు, 50 మంది ఏఆర్ఎస్ఐ/హెడ్కానిస్టేబుల్, పీసీలు 217 మంది, ఎల్జీఎస్ 10 మందిని కేటాయిస్తూ బెటాలియన్ కమాండెంట్స్కు సమాచారం వెళ్లింది.
బెటాలియన్కు సెక్యూరిటీ బాధ్యతలు
దాదాపు 25 ఏండ్లుగా సెక్రటేరియెట్కు తెలంగాణ స్టేట్స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్పోలీసులు భద్రతనిస్తున్నారు. ఇప్పుడు కూడా వారి ఆధ్వర్యంలోనే సెక్యూరిటీ కొనసాగుతోంది. ప్రస్తుతం దాదాపు 120 మంది సిబ్బంది పనిచేస్తున్నారు. ఇప్పటి వరకు ఎస్పీఎఫ్ నుంచి ఎలాంటి సమస్యలు రాలేదు. అయితే, ఎస్పీఎఫ్ను కాదని బెటాలియన్కు కొత్త సెక్రటేరియెట్లో భద్రత బాధ్యతలు అప్పగించడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎలాంటి ఆర్డర్ లేకుండానే నేరుగా డీజీపీ ఆఫీస్ నుంచి బెటాలియన్కు సమాచారం ఇచ్చినట్లు తెలిసింది. దీంట్లోనూ ఏదో మిస్ కమ్యూనికేషన్ జరిగిందని కొందరు అధికారులు చెబుతున్నారు.
ఇంటెలిజెన్స్ నిఘా
సెక్రటేరియెట్లోకి ఎవరు వస్తున్నారు ? ఎవరు వెళ్తున్నారు ? ఏ ఉన్నతాధికారి ఎంతసేపు ఉంటున్నారు ? ఎవరెవరిని ఎవరు కలుస్తున్నారే సమగ్ర వివరాలతో ఇంటెలిజెన్స్ రెగ్యులర్ వాచ్ చేయనున్నది. ప్రతి ఒక్కరి కదలికను చూడటంతో పాటు సెక్రటేరియెట్పై డెయిలీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఇప్పుడు సీఎం, సీఎంవో మొత్తం ప్రగతి భవన్ నుంచి పనిచేస్తోంది. అయితే, సెక్రటేరియెట్ ఓపెన్ తర్వాత అంతా ఇక్కడి నుంచే పనిచేయనున్నారు. అందులో భాగంగానే ఇప్పుడు పనిచేస్తున్న సిబ్బందికి రెట్టింపు సంఖ్యలో పెట్టాలని నిర్ణయించారు. కాగా, ఇంటెలిజెన్స్ లెటర్ను బట్టి ఈ నెల 18న కొత్త సెక్రటేరియెట్ను ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ.. పనులు కంప్లీట్కాలేదు. దీంతో ఒక్క ఫ్లోర్ మాత్రమే ఒపెన్ చేస్తారనే చర్చ జరుగుతోంది. ఓపెనింగ్ ఇంకొన్ని రోజులు పోస్ట్పోన్ అయ్యే అవకాశం లేకపోలేదని అంటున్నారు.