జీఎస్​డీపీలో మనం నంబర్‌‌ 4

జీఎస్​డీపీలో మనం నంబర్‌‌ 4

హైదరాబాద్, వెలుగు:  రాష్ట్ర స్థూల ఉత్పత్తి (జీఎస్​డీపీ: గ్రాస్​ స్టేట్​ డొమెస్టిక్​ ప్రొడక్ట్​) వృద్ధి రేటులో రాష్ట్రం నాలుగో స్థానానికి పడిపోయింది. వృద్ధి రేటు 14.84 శాతంగా నమోదైంది. ఈ జాబితాలో 17.81 శాతం వృద్ధితో పశ్చిమబెంగాల్​ ఫస్ట్​ ర్యాంకు సాధించింది. 15.3 శాతం వృద్ధితో ఏపీ రెండు, 15.01 శాతంతో బీహార్​ మూడు స్థానాలను దక్కించుకున్నాయి. నిజానికి కేంద్రం బడ్జెట్​ ప్రవేశపెట్టిన జులై 4 నాటికి ఆర్థిక సర్వే నివేదికలో 18 రాష్ట్రాల జీఎస్​డీపీ వృద్ధి రేటును చెప్పలేదు. అప్పటికి సమాచారం అందుబాటులో ఉన్న 11 రాష్ట్రాల వృద్ధితో పోలిస్తే తెలంగాణ టాప్​లో నిలిచింది. అయితే, గతంలో మిస్సైన రాష్ట్రాల్లోని 9 రాష్ట్రాల జీఎస్​డీపీ వృద్ధి రేటు వివరాలను కేంద్రం ఇటీవల జత చేసింది. దీంతో ఆయా రాష్ట్రాల గ్రోత్​ రేట్​నూ కలిపి రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల జీఎస్​డీపీపై సామాజిక ఆర్థిక పరిస్థితులతో నివేదిక ఇచ్చింది. దాని ప్రకారం గతంలో మొదటి స్థానంలో ఉన్న రాష్ట్రం ఇప్పుడు మూడు స్థానాలు తగ్గి నాలుగో స్థానానికి పడిపోయింది. గుజరాత్​, మహారాష్ట్ర తదితర పది రాష్ట్రాల సమాచారమూ అందుబాటులోకి వస్తే జీఎస్​డీపీ వృద్ధి రేటులో రాష్ట్రం స్థానం మరింత పడిపోయే అవకాశం ఉందంటున్నారు.

మనల్ని దాటేసిన ఏపీ

జీఎస్​డీపీలో రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్​ దాటేసింది. రాష్ట్ర విభజన తర్వాత ఏపీ ఐదేళ్ల సగటు వృద్ధి రేటు 14.99 శాతంగా నమోదైంది. తెలంగాణ వృద్ధి రేటు మాత్రం 13.9 శాతమే ఉంది. తాజా లెక్కల ప్రకారం 2018–19 సంవత్సరానికిగానూ రాష్ట్ర సంపద 8 లక్షల 65 వేల 688 కోట్ల రూపాయలు కాగా, ఏపీది 9 లక్షల 33 వేల 402 కోట్లుగా నమోదైంది. ఒక రాష్ట్రాభివృద్ధికి జీఎస్​డీపీనే లెక్కలోకి తీసుకుంటారు. దాని ప్రకారమే రెవెన్యూ రాబడులు, ఖర్చులు, పెట్టుబడి వ్యయాలను అంచనా వేస్తారు. అయితే రాష్ట్రంలో వ్యవసాయం, అనుబంధ రంగాల్లో మూడేళ్లుగా జీఎస్​డీపీ వృద్ధి రేటు తగ్గుతూ వస్తోంది. 2016–17లో  18.4 శాతం వృద్ధి రేటు సాధించగా, 2017–18లో 14.4 శాతం, 2018–19లో 9.6 శాతం మాత్రమే వృద్ధి రేటు నమోదైంది.