రాష్ట్రం అంచనా కంటే కేంద్రం నుంచి ఎక్కువ ఫండ్స్

రాష్ట్రం అంచనా కంటే కేంద్రం నుంచి ఎక్కువ ఫండ్స్
  •     రాష్ట్ర సర్కారు అంచనా వేసుకున్న గ్రాంట్లు రూ.10,525 కోట్లు
  •     కేంద్రం నుంచి డిసెంబర్​ నాటికే వచ్చినవి రూ.12,018 కోట్లు
  •     మిగతా 3 నెలల్లో మరిన్ని నిధులు!

హైదరాబాద్, వెలుగు: రాష్ట్రం అంచనా కంటే కేంద్రం నుంచి రెండేళ్లుగా ఎక్కువ గ్రాంట్​ఇన్ ​ఎయిడ్ ​అండ్​ కాంట్రిబ్యూషన్స్​ ఫండ్​ వస్తోంది. దీంతోపాటు జీఎస్టీ బకాయిలను కూడా కేంద్రం ఎప్పటికప్పుడు అన్ని రాష్ట్రాలకు రిలీజ్‌ చేస్తోంది. కాగ్ రిలీజ్​ చేసిన రిపోర్టులో ఈ వివరాలు వెల్లడయ్యాయి. ప్రస్తుత ఫైనాన్షియల్​ఇయర్​లో డిసెంబర్ ​నాటికే రాష్ట్ర సర్కారు బడ్జెట్​లో వేసుకున్న అంచనాల కంటే 14% అదనంగా గ్రాంట్లు వచ్చాయి. సోమవారం 2021–22 కేంద్ర బడ్జెట్​ఉండటంతో ఈసారి కూడా గ్రాంట్లు ఎక్కువే వస్తాయని అధికారులు అంచనా వేస్తున్నారు. బీజేపీ అధికారంలోని లేని రాష్ట్రాలకు కేంద్రం మొండిచెయ్యి చూపుతోందన్న ఆరోపణలు తప్పు అని ఈ లెక్కలు స్పష్టం చేస్తున్నాయని ఎక్స్​పర్టులు అంటున్నారు.

పోయినేడాది 41 శాతం ఎక్కువ..

2020–21లో కేంద్రం నుంచి గ్రాంట్ల రూపంలో రూ.10,525.36 కోట్లు వస్తాయని రాష్ట్ర బడ్జెట్‌లో అంచనా వేశారు. అయితే డిసెంబర్​ నాటికే రూ.12,018 కోట్లు (114%) ఫండ్స్​ వచ్చాయి. ఫైనాన్షియల్​ ఇయర్​లో మిగిలిన 3 నెలల్లో మరిన్ని నిధులు వస్తాయని అధికారులు చెప్తున్నారు. ఇక 2019–20 బడ్జెట్‌లో కేంద్రం నుంచి రాష్ట్రానికి రూ.8,177.75 కోట్లు వస్తాయని అంచనా వేసుకోగా.. కేంద్రం రూ.11,598 కోట్లు (141.83%) ఇచ్చింది. జీఎస్టీ పరిహారం కింద రావాల్సిన మొత్తాన్ని  లోన్ల రూపంలో తీసుకునే వెసులుబాటును కూడా కేంద్రం కల్పించింది. కరోనా లాక్‌డౌన్‌తో రాష్ట్రాల ఇన్​కంపై ప్రభావం పడటంతో ఎఫ్ఆర్​బీఎం పరిమితిలో ప్రత్యేక వెసులుబాటును కొనసాగించే చాన్స్​ ఉందని అధికారులు చెప్తున్నారు.