
- లాక్డౌన్ సడలించిన తర్వాత 800కు పైగా నమోదు
- కంటెయిన్మెంట్ల కుదింపు.. తక్కువ సంఖ్యలో టెస్టులు
- ఈ టైంలో మొత్తం ఓపెన్ చేయడంతో విస్తరిస్తున్న వైరస్
- ఫిజికల్ డిస్టెన్స్ కనిపిస్తలేదు.. కనీస జాగ్రత్తలూ లేవు
- ఎక్కడేమైందో, కేసులెందుకు పెరుగుతున్నయో
తెలియక ఆందోళన పడుతున్న జనం
వెలుగు, హైదరాబాద్: ఇంతకాలం కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేసిన సర్కారు రిలాక్సయింది. ఇదే టైమ్లో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. మార్చి, ఏప్రిల్నెలల్లో కాస్త అదుపులో ఉన్న వైరస్.. కొద్దిరోజులుగా ఎఫెక్ట్ చూపుతోంది. ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వైరస్ వ్యాప్తి పెరగడం, జిల్లాల్లోనూ కొత్త కేసులు రావడం ఆందోళన రేపుతోంది. సర్కారు కంటెయిన్మెంట్లను కుదించడం, పాజిటివ్వాళ్ల కాంటాక్ట్స్కు టెస్టులు చేయకపోవడం, కొత్త కేసులు ఏయే ప్రాంతాల్లో వచ్చాయన్న వివరాలు చెప్పకపోవడం, చనిపోయినోళ్ల వివరాలనూ దాచిపెట్టడం మరింత గందరగోళం సృష్టిస్తోంది.ఈ నెల 18న సీఎం కేసీఆర్ రాష్ట్రమంతా గ్రీన్ జోన్గా ప్రకటించారు. దాంతో కరోనా వైరస్ వ్యాప్తి తగ్గినట్టేననుకున్న జనం.. మళ్లీ పెరుగుతున్న కేసుల సంఖ్యను చూసి ఆందోళన చెందుతున్నారు. కేసులెట్లా పెరుగుతున్నాయి, ఎక్కడ నమోదయ్యాయి, ఎవరి ద్వారా వైరస్ సంక్రమిస్తోందంటూ ఆరా తీస్తున్నారు.
లాక్డౌన్ తర్వాతి నుంచి..
మార్చిలో తొలికేసు వచ్చినప్పటి నుంచి గురువారం వరకు రాష్ట్రంలో 2,256 కేసులు నమోదయ్యాయి. మొత్తం 67 మంది కరోనాతో చనిపోయారు. ఇందులో నాలుగో విడత లాక్ డౌన్ పొడిగించిన తర్వాత వచ్చిన కేసులే సగం మేర ఉన్నాయి. గత మూడు వారాల్లోనే 1,055 పాజిటివ్ కేసులు రావడం, వందల సంఖ్యలో చిన్న పిల్లలకూ వైరస్ సోకడం ఆందోళనకరంగా మారింది. లాక్డౌన్ సడలింపులు ఇచ్చిన రోజున హైదరాబాద్లో పదకొండు కంటెయిన్ మెంట్ జోన్లలోనే కట్టుదిట్టమైన చర్యలుంటాయని కేసీఆర్ ప్రకటించారు. ఆ తర్వాతి రోజు నుంచే కేసుల సంఖ్య బాగా పెరిగింది. రోజూ సగటున 40 వరకు కేసులురాగా.. రెండు రోజులుగా వందకుపైనే నమోదవుతున్నాయి. సర్కారు కంటెయిన్మెంట్జోన్లను మళ్లీ పెంచిందా, ఏయే ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలన్నది ప్రశ్నార్థకంగా మారింది. అసలు ఏ కారణాల వల్ల కరోనా మళ్లీ వ్యాపిస్తోందన్న దానిపై జనాన్ని అలర్ట్ చేసే దిశగా హెల్త్డిపార్ట్మెంట్ హెచ్చరికలేమీ జారీ చేయకపోవటంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కరోనాతో కలిసి బతకాలంటూ సందేశమిచ్చిన సర్కారు.. ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిందన్న విమర్శలు వస్తున్నాయి.
సర్కారే రూల్ తప్పింది!
రాష్ట్ర సర్కారు మూడో విడత లాక్ డౌన్ తర్వాత రాత్రి కర్ఫ్యూ మినహా దాదాపు అన్ని సడలింపులు ఇచ్చేసింది. ఆర్టీసీ, రైలు ప్రయాణాలు, ఇతర రాష్ట్రాల నుంచి, విదేశాల నుంచి జనం తిరిగొస్తూనే ఉన్నరు. వాళ్లతో వైరస్ వ్యాప్తి పెరిగే ప్రమాదం ఉందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. సర్కారు అధికారికంగానే మంత్రులు, ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో సభలు, సమావేశాలకు గ్రీన్సిగ్నల్ఇవ్వటం పల్లెల్లో కలకలం రేపుతోంది. జిల్లాల్లో రైతు అవగాహన సదస్సులు, ప్రారంభోత్సవాల్లో నేతల హడావుడి, గుంపులు గుంపులుగా జనం, ఫిజికల్డిస్టెన్స్, మాస్కులు, శానిటైజర్ల వంటి జాగ్రత్తలు చేపట్టకపోవడం ప్రమాదకరమేనన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కరోనా మరింతగా విజృంభిస్తోంటే.. సర్కారు దాని కట్టడిని వదిలేసి, సభలు, సమావేశాల బిజీలో ఉండటం ఏంటన్న ప్రశ్నలు వస్తున్నాయి. రాష్ట్రంలో మూడో విడత లాక్ డౌన్ గడువు ఈనెల 31 తో ముగియనుంది. ఈసారి సర్కారు ఎలాంటి చర్యలు తీసుకోనుంది, రాత్రి పూట కర్ఫ్యూ కూడా ఎత్తేస్తారా, కేసులు పెరుగుతున్న టైంలో ఏ నిర్ణయాలు ప్రకటిస్తారన్న చర్చలు జరుగుతున్నాయి.
కాకి లెక్కలు.. బులిటెన్లలో తప్పులు
రాష్ట్రంలో కరోనా కేసుల లెక్కల వెల్లడిపై తొలి నుంచీ సర్కారుపై విమర్శలున్నాయి. హెల్త్ బులిటెన్లను రోజుకో తీరుగా రిలీజ్ చేయడం, రోజూ ఏవో తప్పులు ఉండటం సాధారణంగా మారింది. బుధవారం నాటి హెల్త్ బులిటెన్లోనూ ఇదే అంకెల గారడీ కనిపించింది. పాజిటివ్ కేసుల్లో రాష్ట్రానికి చెందిన వారు 1,842.. రాష్ట్రానికి తిరిగొచ్చిన వలస కార్మికులు 173, సౌదీ అరేబియా నుంచి తిరిగొచ్చినవారు 93, ఇతర దేశాల నుంచి వచ్చిన వాళ్లు 30 మంది ఉన్నట్టు పేర్కొంది. ఈ లెక్కన మొత్తం కేసులు 2,139 అవుతాయి. కానీ కేసుల సంఖ్య 2,098 మాత్రమేనని హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు ప్రకటించడంపై విస్మయం వ్యక్తమైంది. డెత్ కేసులను ప్రకటించకుండా దాచిపెట్టడం ఇప్పటికే వివాదాస్పదమైంది. గాంధీలో కరోనాతో ట్రీట్మెంట్ పొందుతున్న తన భర్త ఏమైపోయాడంటూ హైదరాబాద్కు చెందిన ఒక మహిళ ట్వీట్చేసింది. అయితే అప్పటికే ఆయన చనిపోయాడని, అంత్యక్రియలు కూడా చేసేశామని హెల్త్ మినిస్టర్, డాక్టర్లు చేసిన ప్రకటనలు సర్కారు నిర్వాకాన్ని ఎత్తిచూపాయి.
వారం వారం పెరుగుతనే ఉన్నాయి
రాష్ట్రంలో మార్చి రెండో తేదీన కరోనా తొలి కేసు బయటపడింది. అప్పటి నుంచి మొదటి 4 వారాలు అదుపులో ఉన్న వైరస్.. ఐదో వారం నుంచి విజృంభించింది. పదకొండో వారంలో (ఈ నెల 11 నుంచి 17వ తేదీ వరకు) 355 కేసులు, పన్నెండో వారంలో (18వ తేదీ నుంచి 24 వరకు) 303 కొత్త కేసులురాగా.. ఈ వారం తొలి 4 రోజుల్లోనే 397 కేసులు వచ్చాయి. లాక్డౌన్ తర్వాత దుకాణాలన్నీ తెరవడం, జనం రద్దీ, ప్రభుత్వ, ప్రైవేటు ఆఫీసుల ఉద్యోగులంతా రోడ్డెక్కడంతో వైరస్ వ్యాప్తి పెరుగుతుందని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. జనం తమంతట తాముగా నివారణ చర్యలు పాటించాలని, బయటికి వెళ్తే తగిన జాగ్రత్తలు తీసుకోవాలని స్పష్టం చేస్తున్నారు. గుంపులుగా గుమిగూడొద్దని, ప్రధానంగా వృద్ధులు, పిల్లల విషయంలో పూర్తి అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నారు.
టెస్టుల్లో లాస్ట్.. అడిగినా చెయ్యరట?
కరోనా టెస్టుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం తీరు చిత్రంగా మారింది. పొరుగున ఉన్న ఏపీలో ఏకంగా 3.14 లక్షల మందికి టెస్టులు చేస్తే.. రాష్ట్రంలో చేసింది 27 వేల టెస్టులే. దేశవ్యాప్తంగా టెస్టుల సంఖ్య ప్రకారం చూస్తే.. రాష్ట్రం 21వ ప్లేస్లో వెనకాల ఉండిపోయింది. ఎక్కువ మందికి టెస్టులు చేస్తే.. ఎక్కువ కేసులు వస్తాయనే సర్కారు వెనుకడుగు వేస్తోందన్న ఆరోపణలున్నాయి. అంతేకాదు తమకు కరోనా లక్షణాలున్నాయని, ఆందోళనగా ఉందంటూ వెళ్లిన పేషెంట్లకు కూడా టెస్టులు చేయలేదు. విదేశాల నుంచి వచ్చి క్వారంటైన్లో ఉన్నవాళ్లు అడిగినా, అవసరమైతే తామే ఖర్చు భరిస్తామని కొందరు కోరినా టెస్టులు చేసేందుకు సర్కారు నిరాకరించింది. రాష్ట్రంలో హైదరాబాద్ తర్వాత వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉన్న సూర్యాపేట జిల్లా కేంద్రంలోనే.. రెండు వారాలుగా టెస్టులు చేయటం లేదు. అక్కడ టెస్టుల సంఖ్య పెంచాలని హైకోర్టు ఆదేశించినా ఆ దిశగా ప్రయత్నాలు మొదలవకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.