హైదరాబాద్ పబ్స్ పై  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

హైదరాబాద్ పబ్స్ పై  హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు 

హైదరాబాద్ లోని పబ్స్ పై  తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. రాత్రి 10 నుంచి తెల్లవారుజామున 6 గంటల వరకు ఎటువంటి సౌండ్ పెట్టరాదని, ఈ ఆదేశాలు ఇవాళ్టి నుండి అమలు చేయాలని ఆదేశించింది. సిటీ పోలీస్ యాక్ట్, నాయిస్ పొల్యూషన్ రెగ్యులేషన్ ప్రకారం లౌడ్ స్పీకర్లకు నిర్దేశిత లిమిట్ వరకే  అనుమతి ఇవ్వాలని సూచించింది. రాత్రి సమయాల్లో ఎలాంటి సౌండ్ సిస్టమ్స్ కు అనుమతి లేదని పేర్కొంది. ఎక్సైజ్ రూల్స్ ప్రకారం.. ఇల్లు, విద్యా సంస్థలు ఉన్న ప్రదేశాల్లో పబ్ లకు ఎలా అనుమతి ఇచ్చారని న్యాయస్థానం ప్రశ్నించింది.

పబ్ ల నిర్వహణకు ఏయే అంశాలను పరిగణనలోకి తీసుకుని అనుమతులు ఇచ్చారో.. ఎక్సైజ్ శాఖ కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కోరింది. పబ్ లో రాత్రి పూట కేవలం లిక్కర్ మాత్రమే సరఫరా చేయాలని నిర్దేశించింది. ఇటీవల టాట్ పబ్ విషయంపై హైకోర్టులో పిటిషన్ దాఖలు కావడంతో పిటిషనర్ల తరపున హై కోర్టు న్యాయవాది కైలాష్ నాథ్ వాదించారు. విచారణ సందర్భంగా హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనర్లకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.